తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఇరుగు పొరుగు రాష్ట్రాలు.. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం పక్క రాష్ట్రం మీద కూడా అంతో ఇంతో తప్పక ఉంటుంది. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో.. ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.. మన దగ్గర ఎప్పుడంటూ జనాలు.. ప్రతిపక్షాల నుంచి డిమాండ్ రావటం సహజం. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఇటీవల రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని బాగా పరిశీలించి చూస్తే.. తెలంగాణ ప్రభావంతోనే ఈ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక విషయంలోకి వస్తే ఏపీ ప్రభుత్వం ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమలు చేయనున్నారు.
అయితే ఇలాంటి పథకమే తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉంది. మహాలక్ష్మి పేరుతో తెలంగాణ సర్కారు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. ఈ పథకం అక్కడ విజయవంతంగా అమలవుతున్నప్పటికీ.. ఆరంభ కష్టాలు మాత్రం తప్పలేదు. ముఖ్యంగా ఆటోడ్రైవర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తమ పొట్ట కొట్టొందంటూ ఆటోడ్రైవర్లు నిరసనలు, ఆందోళనలు కూడా చేపట్టారు. తమ ఉపాధి దెబ్బతింటుందని.. గిరాకీ తగ్గిపోతుందని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ.. ఆటో డ్రైవర్ల జీవితాలపై మాత్రం ప్రభావం పడిందనే చెప్పొచ్చు.
ముఖ్యంగా అప్పటి వరకూ షేర్ ఆటోల ద్వారా ప్రయాణించిన మహిళలు.. బస్సులవైపు మొగ్గుచూపటంతో ఆటో డ్రైవర్ల గిరాకీలు 40 నుంచి 50 శాతం దాకా పడిపోయాయని ఆటో సంఘాలు చెప్తున్నాయి. దీంతో ఆటో కార్మికుల కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభత్వమే తమను ఆదుకోవాలని.. ఆర్థిక మద్దతు అందించాలని ఆటో యూనియన్లు డిమాండ్ చేశాయి. ఇక ఏటా వారికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామనే భరోసాను తెలంగాణ ప్రభుత్వం అందించింది. ఇదీ తెలంగాణ మాట. అయితే తెలంగాణలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ముందే మేల్కొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం రోజునే ఆటో కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభం కంటే ముందే ఆటో సంఘాలతో చర్చించాలని మంత్రులకు సూచించారు. ఆ రకంగా ఆటోడ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ముందు జాగ్రత్త పడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరొక విషయం ఏమిటంటే... తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలైన తొలినాళ్లల్లో బస్సులలో సీట్ల కోసం మహిళల మధ్య ముష్టియుద్ధాలు జరిగిన ఘటనలు అనేకం. రోజూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. సీట్ల కోసం మహిళలు పోటీలు పడటం, కొట్టుకోవటం వైరల్ అయ్యాయి. అక్కడక్కడా ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. కానీ.. ఏపీలో ఉచిత బస్సు పథకం ఇప్పుడిప్పుడే ప్రారంభం కానుంది. దీంతో మొదట కొన్ని రోజులు బస్సులలో మహిళల రద్దీ, సీట్ల కోసం పోటీలు తప్పదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం.. మహిళల భద్రత దృష్ట్యా అన్ని బస్సులలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే మహిళా కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలు సమకూర్చాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనివలన బస్సులో ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే కనిపెట్టవచ్చనేది ప్రభుత్వం ఉద్దేశం. గొడవలు, తోపులాటలో పాటుగా ఆర్టీసీ సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa