ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హర్భజన్ సింగ్

sports |  Suryaa Desk  | Published : Thu, Aug 14, 2025, 06:27 AM

సరిహద్దుల్లో మన సైనికులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తుంటే, పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం ఎంతవరకు సమంజసం అని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా ప్రశ్నించాడు. దేశ ప్రయోజనాల ముందు క్రికెట్ చాలా చిన్న విషయమని, పాక్‌తో అన్ని రకాల క్రికెట్ సంబంధాలను బహిష్కరించాలని గట్టిగా వాదించాడు.ఆసియా కప్ 2025 షెడ్యూల్‌లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కొద్ది వారాల క్రితం జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్  టోర్నీలో శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే, ఆసియా కప్‌లో మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించడంపై భజ్జీ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.ఈ విషయంపై హర్భజన్ మాట్లాడుతూ, "సరిహద్దులో నిలబడి మనల్ని కాపాడుతున్న సైనికుడి త్యాగం చాలా గొప్పది. కొన్నిసార్లు వారు ప్రాణాలతో తిరిగి రారు. వారి కుటుంబాలు పడే వేదన వర్ణనాతీతం. అలాంటి త్యాగాల ముందు మనం ఒక క్రికెట్ మ్యాచ్‌ను వదులుకోలేమా దేశం కంటే ఏ ఆటగాడూ, నటుడూ గొప్ప కాదు. మన గుర్తింపు అంతా ఈ దేశం వల్లే వచ్చింది" అని స్పష్టం చేశారు."రక్తం, నీళ్లు ఒకేసారి కలిసి ప్రవహించలేవు. సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు మనం వారితో క్రికెట్ ఆడటం సరికాదు. ఈ పెద్ద సమస్యలు పరిష్కారమయ్యే వరకు క్రికెట్ ఆడకపోవడమే మంచిది. ఇది మన ప్రభుత్వ వైఖరి కూడా" అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆటగాళ్లే కాదు, పాకిస్థాన్ ఆటగాళ్లను, వారి స్పందనలను మన మీడియా కూడా చూపించకూడదని హర్భజన్ సూచించారు. "వారు తమ దేశంలో కూర్చొని ఏమైనా మాట్లాడవచ్చు, కానీ మనం వాటిని హైలైట్ చేయకూడదు" అని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa