కొన్ని కొన్ని దొంగతనాల గురించి విన్నపుడు.. బాధ కంటే ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు దొంగతనం కంటే.. దాన్ని చేసిన విధానమే బాగా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా రోడ్లపై, ఇళ్లల్లో బంగారం దొంగిలించాలంటే.. చేయి తిరిగిన దొంగలు అయితేనే దొరకకుండా చోరీ చేసి పారిపోతారు. అలా కాదని ఎవరు పడితే వాళ్లు దొంగతనానికి ట్రై చేస్తే.. అడ్డంగా బుక్ అయి.. కటకటాల్లోకి వెళ్తారు. ఇవి మనం సాధారణంగా చూసే దొంగతనాలే. కానీ ఈ ఘటనలో మాత్రం.. ఓ కాకి భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్లడం ఇప్పుడు అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. రూ.3.5 లక్షల విలువైన బంగారాన్ని కాకి ఎత్తుకుపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
త్రిస్సూర్ జిల్లాలోని మథిలకం ప్రాంతంలో నివసిస్తున్న షిర్లీ అనే మహిళ.. స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన.. షిర్లీ అంగన్వాడీ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుండగా.. ఆమె మెడలో ఉన్న రూ.3.5 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు గొలుసు తీసి.. మెట్లపై పెట్టింది. ఆ గోల్డ్ చైన్ పక్కనే ఒక ఆహార ప్యాకెట్ కూడా ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కాకి.. ఒక్కసారిగా ఆ ఆహార ప్యాకెట్ను వదిలేసి.. గోల్డ్ చైన్ను తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది.
అయితే తన బంగారు గొలుసును ఎత్తుకెళ్తున్న కాకిని గుర్తించిన షిర్లీ.. అరుపులు, కేకలతో ఆ కాకి వెంట పరుగులు తీసింది. అది చూసిన స్థానికులు కూడా కాకి వెంట పడ్డారు. మొదట ఒక చెట్టుపై నిలబడిన కాకి.. ఆ బంగారు గొలుసును అక్కడే విడిచిపెట్టి.. పక్కనే ఉన్న అడవుల్లోకి ఎగిరిపోయింది. ఈ క్రమంలోనే ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో వెతకగా.. చివరికి ఆ బంగారు గొలుసు దొరికింది. దీంతో షిర్లీతోపాటు స్థానికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కాస్తా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa