భారత రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రవేశపెట్టిన సరికొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్కు ఊహించని స్పందన లభించింది. తొలిరోజునే ఏకంగా 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ కొత్త పాస్ను కొనుగోలు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించి, సమయాన్ని ఆదా చేయడానికి ప్రవేశపెట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి లభించిన ఈ ఆదరణ ఒక గొప్ప విజయంగా చెప్పవచ్చు.
ఆగస్టు 15వ తేదీన అమల్లోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకే దాదాపు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అలాగే టోల్ ప్లాజాల్లో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదు అయ్యాయి. NHAI వివరాల ప్రకారం.. దాదాపు 20 వేల నుంచి 25 వేల మంది వినియోగదారులు ఏక కాలంలో ఈ వార్షిక్ పాస్ను వినియోగించుకున్నట్లు వివరించారు. ముఖ్యంగా పాస్ వినియోగదారులకు సజావుగా ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ప్రతీ టోల్ ప్లాజాలో NHAI అధికారులు, నోడల్ అధికారులను నియమించారు. అలాగే పాస్ వినియోగదారుల సందేహాలను వివిధ మార్గాల ద్వారా పరిష్కరిస్తున్నారు.
సాధారణ ఫాస్టాగ్తో పోలిస్తే.. ఈ వార్షిక పాస్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఒకే టోల్ ప్లాజా నుంచి తరచూ ప్రయాణించే వారికి ఇది చాలా సౌలభ్యాన్ని చేకూరుస్తుంది. ఈ కొత్త పాస్ ద్వారా సంవత్సరం మొత్తం ఒకే టోల్గేట్ను ఎన్నిసార్లైనా దాటి వెళ్లవచ్చు. ఈ పాస్ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆన్లైన్లో తమ వాహనాల వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ సౌలభ్యం వల్ల ప్రతిసారీ టోల్ గేట్ వద్ద ఆగి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ఇంధనం ఆదా అవడమే కాకుండా సమయం కూడా మిగులుతుంది. ఇది పట్టణ ప్రాంతాల నుంచి పక్కన ఉన్న హైవేలకు రాకపోకలు సాగించే వారికి, అలాగే టోల్ గేట్ల దగ్గర ఉండే స్థానిక నివాసితులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్కు తొలి రోజే భారీ స్పందన లభించడానికి ప్రధాన కారణం దాని ద్వారా లభించే ప్రయోజనాలే. ఇది వినియోగదారులకు డబ్బును ఆదా చేయడమే కాకుండా ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. డిజిటల్ చెల్లింపుల పట్ల పెరుగుతున్న ఆదరణ కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. నేటి ఆధునిక యుగంలో ప్రజలు సాంకేతికతను ఆశ్రయిస్తూ.. తమ రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ఇష్ట పడుతున్నారు. ఈ వార్షిక పాస్ అందుకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa