ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పరిణామం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 10:27 PM

భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పరిణామం.. 3 రోజులపాటు భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి(ఫోటోలు- Samayam Telugu)


2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలు.. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఈ ఉద్రిక్తతలతో భారత్‌-చైనా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత్, చైనాలు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లతో భారత్, చైనాలు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్, చైనా మధ్య సత్సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక ముందడుగు పడింది.


భారత్-చైనా సరిహద్దు సమస్యలపై చర్చించేందుకు.. ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యి.. త్వరలోనే భారత్‌కు రానున్నట్లు చైనా దేశ విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. ఆగస్ట్ 18వ తేదీ (సోమవారం) నుంచి 20వ తేదీ వరకు వాంగ్ యీ.. 3 రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా వాంగ్ యీ.. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్‌ ధోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌ సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.


కరోనా మహమ్మారి, గల్వాన్‌ ఘర్షణల నేపథ్యంలో భారత్‌-చైనాల మధ్య ఇప్పటికే పలు వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల భారత్, చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌ ప్రాంతంలో రెండు దేశాల బలగాలను ఉపసంహరించుకోవడం.. సరిహద్దుల్లో గస్తీ మళ్లీ మొదలుపెట్టడం, భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభించడం, కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం వంటి విషయాల్లో రెండు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.


ఈ క్రమంలోనే తాజాగా భారత్‌లో వాంగ్‌ యీ పర్యటన రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాల్లో కీలకంగా మారనున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో భారత్, చైనా మధ్య దౌత్యపరమైన, వాణిజ్య పరంగా పరస్పర సహకారం కోసం సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఇటీవలె భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్‌ ధోవల్ కూడా చైనాలో పర్యటించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా త్వరలోనే చైనాలో పర్యటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa