ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టులో బియ్యం విసిరిన వ్యక్తికి జైలుశిక్ష

national |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 10:30 PM

సాధారణంగా కోర్టు గదిలో ఏదైనా అలజడి సృష్టిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. కానీ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక వ్యక్తి కోర్టు గదిలో న్యాయమూర్తి ఎదుటే బియ్యం గింజలు విసిరినందుకు గాను జైలు శిక్షకు గురయ్యాడు. ఈ కేసుపై పలురకాల వ్యాఖ్యానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కేవలం కోర్టు ధిక్కారమా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అన్న సందేహాలకు తావిస్తోంది.


ఆగస్టు 11వ తేదీన ఢిల్లీలోని ఒక న్యాయస్థానంలో ఈ సంఘటన జరిగింది. అడిషనల్ సెషన్స్ జడ్జి షెఫాలీ బర్నాల టండన్ ఎదుట ఒక కేసు విచారణ జరుగుతుండగా ఈ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడిని డాక్టర్ చందర్ విభస్‌గా గుర్తించారు. అతను వృత్తిరీత్యా ఒక సర్జన్. కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. డాక్టర్ చందర్ విభస్ ఒక్కసారిగా తన జేబులోంచి కొన్ని బియ్యం గింజలను తీసి న్యాయమూర్తి కూర్చునే వేదిక (డయాస్) వైపు విసిరాడు. ఈ చర్యతో కోర్టు గదిలో ఉన్నవారందరూ తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన వలన కోర్టు విచారణ 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది.


కోర్టులో బియ్యం విసరడం వల్ల అక్కడ ఉన్న న్యాయవాదులు, సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. చాలా మంది ఈ చర్య వెనుక "చేతబడి" లేదా అసాధారణ శక్తుల ప్రమేయం ఉండవచ్చని అనుమానించారు. న్యాయవాదులు న్యాయమూర్తి వేదిక వైపు వెళ్లడానికి కూడా సంకోచించారు. ఈ అసాధారణ వాతావరణం, ఉద్దేశపూర్వకంగా కోర్టు కార్యకలాపాలను అడ్డుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి చర్య కోర్టు పవిత్రతను, గౌరవాన్ని దెబ్బతీసేదిగా భావించారు.


ఈ ఘటనతో న్యాయమూర్తి షెఫాలీ బర్నాల టండన్.. నిందితుడు డాక్టర్ చందర్ విభస్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారించారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 267 ప్రకారం.. కోర్టు విచారణను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడు తన చర్యకు వెంటనే పశ్చాత్తాపం చెంది.. కోర్టును క్షమించమని కోరాడు. తాను చేసిన పనికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ న్యాయమూర్తి అతని వాదనను అంగీకరించకుండా, ఈ చర్య కోర్టు పవిత్రతకు భంగం కలిగించేదిగా భావించి కఠినమైన శిక్ష విధించారు.


తీర్పులో భాగంగా.. డాక్టర్ చందర్ విభస్‌కు 2,000 రూపాయల జరిమానాతో పాటు "జైలు శిక్ష"ను విధించారు. జైలు శిక్ష అనగానే ఎన్ని నెలలో, ఏళ్ల అనుకునేరు.. కోర్టు కార్యకలాపాలు ముగిసేంత వరకు మాత్రమే జైల్లో ఉంచాలని చెప్పారు. ఈ కఠినమైన తీర్పు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించే ఉద్దేశంతో ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. న్యాయస్థానంలో ప్రవర్తించే విధానం.. దాని గౌరవాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ఈ కేసు మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి అసాధారణ కేసులో న్యాయస్థానం తీసుకున్న కఠినమైన నిర్ణయం సమాజానికి ఒక హెచ్చరికగా నిలిచిందని న్యాయ నిపుణులు అభిప్రాయప డుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa