పశ్చిమ్ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. పూర్బ్ బర్దమాన్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితులంతా బిహార్కు చెందినవారిగా గుర్తించారు. బర్ధమాన్లోని గంగానదిలో పవిత్ర స్నానాలు అనంతరం దుర్గాపూర్కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 19వ నెంబరు జాతీయరహదారిపై నాలా ఫెర్రీ ఘాట్ సమీపానికి వచ్చేసరికి అక్కడ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద సమయానికి బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్దారించింది. మృతుల్లో ఎనిమిది మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉండగా.. ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను చికిత్స కోసం బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం తరలించినట్టు పోలీసులు తెలిపారు. అతివేగం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్రక్కును డ్రైవర్ గమనించలేదని అన్నారు. ప్రమాదంపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
రెండు రోజుల కిందట రాజస్థాన్లోనూ ఇటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో స్టేషనరీ ట్రక్కును.. పికప్ వ్యాన్ ఢీకొట్టడంతో ఏడుగురు చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బాధితులు యూపీలోని ఎటావా జిల్లాలోని కథు శ్యామ్, సల్సార్ బాలాజీ ఆలయాలను దర్శించుకుని.. స్వస్థలాలకు తిరిగొస్తుండగా మనోహర్పూర్ జాతీయ రహదారిపై ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa