ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉచిత బస్సు పథకం: ఒక్క రోజే ఓ కుటుంబానికి రూ.1160 లబ్ధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 10:38 PM

ఏపీలో ఉచిత బస్సు పథకం ఎఫెక్ట్.. ఒక్క రోజే ఓ కుటుంబానికి రూ.1160 లబ్ధి.. ఏం వాడకం సామీ!(ఫోటోలు- Samayam Telugu)


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం అమలు ప్రారంభమైంది. ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఐదు రకాల బస్సులలో మహిళలకు జీరో ఫేర్ టికెట్లు మంజూరు చేస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ జీరో ఫేర్ టికెట్లలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణించారనే వివరాలతో పాటుగా.. స్త్రీ శక్తి పథకం అమలు కారణంగా వారికి ఎంతమేరకు లబ్ధి కలిగిందనే వివరాలు ఉంటాయి. ఈ క్రమంలోనే స్త్రీ శక్తి పథకం ద్వారా ఓ కుటుంబం ఒక్క రోజే రూ.1160 లబ్ది పొందింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.


ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్న కుటుంబం అంబాజీపేట నుంచి విజయవాడ ప్రయాణించింది. మొత్తం ఐదుగురికి స్త్రీ శక్తి పథకం కింద జీరో ఫేర్ టికెట్లు అందించారు. మహిళలు ముగ్గురికీ ఒక్కొక్కరికీ 280 రూపాయలు చొప్పున 840 రూపాయలు అయితే.. ఇద్దరు బాలికలకు ఒక్కొక్కరికి రూ.160 చొప్పున రూ. 320లు అయ్యింది, దీంతో మొత్తంగా ఆ కుటుంబానికి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా రూ.1160 లబ్ధి చేకూరింది. దీంతో రూపాయి ఖర్చు లేకుండా సురక్షితంగా విజయవాడకు చేరుకున్నామని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆ కుటుంబం. ఈ విషయాన్ని టీడీపీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.


 మరోవైపు స్త్రీ శక్తి పథకంలో భాగంగా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి చూపించి మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత బస్సు పథకం కోసం ఏపీఎస్ఆర్టీసీ వద్ద ఉన్న 11,449 బస్సుల్లో, 8,458 బస్సులు కేటాయించారు. అలాగే బస్సులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా త్వరలోనే రియల్‌టైమ్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ తేనున్నారు.


మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆటోడ్రైవర్లు తాము ఉపాధిని కోల్పోతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసింది. ఆటోడ్రైవర్లకు పది వేలు ఆర్థిక సాయం అందించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అలాగే మంత్రివర్గ ఉపసంఘం చేసే సూచనలు, సలహాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa