ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెత్త రహితంగా మార్చేందుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం వంటి చర్యలు చేపడుతున్నారు. ఆగస్ట్ 15 నుంచి ఏపీ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించిన సంగతి తెలిసిందే. వీటితో పాటుగా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఏపీ ప్రభుత్వం స్వచ్ఛ రథం కాన్సెప్టుతో ముందుకు వచ్చింది. ఇప్పటికే పలుచోట్ల ఈ స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా పంద్రాగస్టు పండగ నాడు రాజమహేంద్రవరంలో వీటిని ప్రారంభించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి చేతుల మీదుగా రాజమండ్రిలో స్వచ్ఛ రథాలను ప్రారంభించారు.ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ఈ స్వచ్ఛ రథాలు ఉపయోగించనున్నారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులు తీసుకుని వాటికి లెక్కగట్టి.. అందుకు సమాన విలువ కలిగిన నిత్యావసర సరకులను ఈ స్వచ్ఛ రథాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ స్వచ్ఛ రథాలు నిర్దేశిత ప్రాంతాలకు ప్రతి పది రోజులకు ఒకసారి వెళ్తాయి. ఆ సమయంలో ప్రజలు తమ ఇళ్లల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను అందించి.. వాటికి సమానమైన విలువ కలిగిన నిత్యావసర సరకులు ఉచితంగా పొందవచ్చు. ఈ స్వచ్ఛ రథం వాహనదారుడికి కూడా ప్రతి నెలా రూ.25 వేలు వేతనంగా చెల్లించనున్నారు. ఈ రకంగా ప్రజలు చెత్తను ఇచ్చి ఉచితంగా సరుకులు పొందడమే కాకుండా ఓ వ్యక్తికి ఉపాధి కూడా దక్కుతోంది.
మరోవైపు స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లెల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ రథం ద్వారా ప్లాస్టిక్, చెత్త వ్యర్థాలను సేకరిస్తారు. వాటికి బదులుగా 20 రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తారు. ఇక ఈ స్వచ్ఛ రథాల వద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకింగ్ కవర్లు, గాజు సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్యాకెట్లు, పాత పేపర్లు, పుస్తకాలు, అట్టలు, నూనె డబ్బాలు వంటివి తీసుకుంటారు. వాటికి బదులుగా నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇస్తారు.
మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టి వంటి కార్యక్రమాలు కూడా చేపడుతోంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ఓ పరిశ్రమలోని వ్యర్థాలను మరో పరిశ్రమలో ముడిసరుకుగా ఉపయోగించుకునేలా కొత్త ప్రణాళికలు రచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa