ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 29 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

national |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 11:06 AM

ఏడేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. అమెరికాతో భారత్ కు గ్యాప్ పెరిగిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెలాఖరులో జపాన్‌, చైనా దేశాల్లో ఆయన నాలుగు రోజుల పాటు అధికారికంగా పర్యటించనుండగా, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది.షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో మోదీ చైనాలో పర్యటిస్తారు. అక్కడ తియాన్‌జిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. ఏడేళ్ల క్రితం 2018లో కింగ్‌డావోలో జరిగిన ఎస్‌సీవో సదస్సు కోసం మోదీ చివరిసారిగా చైనా వెళ్లారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పర్యటనకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వంటి కీలక నేతలు కూడా పాల్గొననున్నారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత జపాన్‌ వెళ్తారు. ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో అక్కడ పర్యటిస్తారు. ఇది ప్రధాని మోదీకి 8వ జపాన్ పర్యటన కాగా, ఆ దేశ నూతన ప్రధాని ఇషిబాతో జరగనున్న తొలి శిఖరాగ్ర సమావేశం కావడం విశేషం. ఈ 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అధినేతలు పాల్గొంటారు.ఈ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి కీలక రంగాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa