ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరాజ్‌ను వదులుకోవడంపై స్పష్టతనిచ్చిన ఆర్సీబీ డైరెక్ట‌ర్‌ మో బోబాట్

sports |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 01:36 PM

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు తమ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందనే దానిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  యాజమాన్యం ఎట్టకేలకు మౌనం వీడింది. ఇదొక కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ, భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకునే వ్యూహంలో భాగంగానే ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ స్పష్టం చేశారు. ఈ వ్యూహం ఫలించి, 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం.ఈ విషయంపై మో బోబాట్ మాట్లాడుతూ"సిరాజ్ విషయంలోనే మేం అత్యంత సుదీర్ఘంగా చర్చించాం. అంతర్జాతీయ స్థాయిలో ఆడే భారత బౌలర్లను పొందడం అంత తేలిక కాదు. అతడిని అట్టిపెట్టుకోవాలా, వదిలేయాలా, లేక రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించాలా అనే అన్ని అవకాశాలను మేం పరిశీలించాం. ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు" అని వివరించారు.తమ వ్యూహాన్ని మరింత స్పష్టంగా వివరిస్తూ.. "ఇన్నింగ్స్ ఆరంభంలో, చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల భువనేశ్వర్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని మేము బలంగా అనుకున్నాం. ఒకవేళ సిరాజ్‌ను అట్టిపెట్టుకుని ఉంటే, వేలంలో భువీని కొనడం కష్టమయ్యేది. ఒకే కారణం కాకుండా, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాం" అని బోబాట్ తెలిపారు.ఆర్సీబీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం మంచి ఫలితాన్నిచ్చింది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. వేలంలో రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసిన భువనేశ్వర్ కుమార్ 17 వికెట్లతో రాణించాడు. మరో బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 22 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు, ఆర్సీబీ తరఫున 87 మ్యాచ్‌లలో 83 వికెట్లు పడగొట్టిన సిరాజ్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసి ఫరవాలేదనిపించాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa