రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో వైసీపీ తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని, భవిష్యత్తులో ఎవరికీ పెరోల్ కోసం సిఫారసు లేఖలు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు.శ్రీకాంత్ తండ్రి, సోదరుడు తనను కలిసి అభ్యర్థించడంతో ఒక ప్రజాప్రతినిధిగా సిఫారసు లేఖ ఇచ్చానని కోటంరెడ్డి తెలిపారు. ఇలాంటి లేఖలు ఇవ్వడం సాధారణమేనని, తుది నిర్ణయం అధికారులే తీసుకుంటారని స్పష్టం చేశారు. "నేను ఇచ్చిన లేఖను అధికారులు జులై 16వ తేదీనే తిరస్కరిస్తూ సమాచారం పంపారు. ఆ తర్వాత 14 రోజులకు, అంటే జులై 30న శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేశారు. నా లేఖను తిరస్కరించిన తర్వాత పెరోల్ ఎలా వచ్చిందో విచారణ జరిపించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి ఈ విషయంపై విచారణ జరిపిస్తున్నామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.గతంలో వైసీపీ హయాంలో ఇదే శ్రీకాంత్కు అప్పటి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య సిఫారసు లేఖలు ఇచ్చారని, వాటి ఆధారంగానే అప్పుడు పెరోల్ మంజూరైందని కోటంరెడ్డి గుర్తుచేశారు. "సిఫారసు లేఖలు ఇవ్వడమే నేరంగా చిత్రీకరిస్తున్న వైసీపీ నేతలు, వారు అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాంత్ను ఎలా బయటకు తెచ్చారో సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు లేఖలు ఇవ్వడాన్ని నేను తప్పుపట్టను, కానీ ఇప్పుడు నాపై బురద చల్లడం సరికాదు" అని ఆయన అన్నారు. ప్రతి అంశమూ రాజకీయ జీవితంలో ఒక గుణపాఠమేనని, ఇకపై ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa