దిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ 'వరల్డ్ లీడర్స్ ఫోరం' సదస్సులో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు టారిఫ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎల్లప్పుడూ తన ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తుందని, దేశ రైతులు, చిన్న ఉత్పత్తిదారుల హితం కోసం రాజీ లేని వైఖరిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, భారత్ తన విధానాలను దేశ అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
రష్యా చమురు కొనుగోలుపై వస్తున్న విమర్శలను జైశంకర్ తిప్పికొట్టారు. భారత్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఇష్టం లేని దేశాలు అలా చేయకపోవచ్చని, ఎవరూ బలవంతం చేయడం లేదని ఆయన అన్నారు. 2022లో చమురు ధరలు ఆకాశాన్నంటినప్పుడు, రష్యా చమురు కొనుగోలు ద్వారా భారత్ అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరీకరణకు దోహదపడిందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో, రష్యాతో వాణిజ్యాన్ని మరింత పెంచాలని భారత్ భావిస్తోందని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశాంగ విధానంపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధానాలు సాంప్రదాయ దౌత్య పద్ధతులకు భిన్నంగా, బహిరంగంగా, వాణిజ్య-వాణిజ్యేతర అంశాలకు టారిఫ్లను వినియోగిస్తూ సాగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా చమురు అంశంపై అమెరికాతో ముందస్తు చర్చలు జరపలేదని, అయినప్పటికీ భారత్ తన నిర్ణయాలలో స్వతంత్ర్యాన్ని కొనసాగిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని, ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలని కోరుకుంటున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు. రష్యాతో చమురు వాణిజ్యం దేశ ప్రయోజనాలతో పాటు, అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొనసాగుతోందని ఆయన వివరించారు. భారత్ తన ఆర్థిక, వాణిజ్య విధానాలలో స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటూ, ప్రపంచ వేదికపై బలమైన స్థానాన్ని నిలుపుకోవడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa