ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి ఆనంద గజపతి రాజుపై పుస్తకం రాసిన కుమార్తె ఊర్మిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 06:59 AM

దివంగత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతి రాజుకు ఆయన కుమార్తె ఊర్మిళ గజపతి రాజు అక్షర నివాళి అర్పించారు. ఆయన జీవిత విశేషాలతో కూడిన ఒక బయోగ్రఫీని రచించి, ఆయన 75వ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ప్రజా ప్రతినిధిగా, సింహాచలం దేవస్థాన పారంపర్య ధర్మకర్తగా ఆయన అందించిన సేవలతో పాటు, ఒక తండ్రిగా ఆయన వ్యక్తిత్వాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.విశాఖపట్నంలోని గ్రాండ్ బే హోటల్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆనంద గజపతి రాజు సోదరుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తండ్రి జ్ఞాపకాలను పదిలపరిచేలా ఊర్మిళ చేసిన ఈ ప్రయత్నం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వక్తలు ప్రశంసించారు.ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన తనకు సింహాద్రి అప్పన్న చందనోత్సవం రోజున కలిగిందని ఊర్మిళ గజపతి రాజు తెలిపారు. "మా నాన్నగారు ఒక ఎంపీగా, మంత్రిగా అందరికీ తెలుసు. కానీ ఒక మనిషిగా ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆశయాలు ప్రపంచానికి తెలియాలి. ఆయన ఆలోచనలు నాలుగు గోడల మధ్యే ఉండిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రాశాను" అని ఆమె వివరించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కేవలం రెండు నెలల్లోనే పరిశోధన చేసి, పలువురి అభిప్రాయాలు సేకరించి ఈ పుస్తకాన్ని పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు.ఆనంద గజపతి రాజు వంటి గొప్ప వ్యక్తి చరిత్రను డాక్యుమెంట్ చేయడం చాలా అవసరమని, కాలక్రమేణా మరుగున పడిపోకుండా ఇలాంటి ప్రయత్నాలు కాపాడతాయని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఊర్మిళ చేసిన ఈ ప్రయత్నాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఆనంద గజపతి రాజు జ్ఞాపకార్థం వెలువడిన ఈ గ్రంథం ఎందరికో స్ఫూర్తినిస్తుందని అశోక్ గజపతి రాజు అన్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా, ఆనంద గజపతి రాజుతో అనుబంధం ఉన్నవారు ఆయన సేవలను, జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa