ఏపీలో దివ్యాంగుల పింఛన్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దివ్యాంగుల పింఛన్లను అనర్హులు పొందుతున్నారంటూ వారిని ఏరివేసే ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. ఈ క్రమంలోనే సదరం శిబిరాలను నిర్వహించి వైకల్య నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైకల్య శాతం తక్కువగా ఉన్నవారికి, పరీక్షలకు రాని వారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది.రీవెరిఫికేషన్ కోసం అవకాశం కూడా కల్పించింది. అయితే అర్హత ఉన్నప్పటికీ తమ పింఛన్లు తొలగించారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల దివ్యాంగులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుల పింఛన్ల తొలగింపు వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. అనర్హుల ఏరివేత పేరుతో అర్హులైన వారి పొట్టకొట్టడం దుర్మార్గమంటూ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
"కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదు. కనికరం లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణం. వికలాంగుల జీవితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గం. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయం. అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గుచేటు. వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదు. బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదే. వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించదగ్గదే. దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళపై, ఇచ్చిన వైద్యులపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కానీ రీ వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్దతి కాదు" అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
దివ్యాంగుల పింఛన్ల జాబితాలో అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదన్న వైఎస్ షర్మిల .. నోటీసులు ఇచ్చిన 1.20 లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోందన్నారు. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని.. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మరోవైపు వైకల్య నిర్ధారణ పరీక్షల సందర్భంగా 18 ఏళ్లలోపు ఉన్న దివ్యాంగులకు తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికేట్ ఇచ్చారు. శరీరంలో 18 ఏళ్ల తర్వాత మార్పులు వస్తాయని.. ఈ నేపథ్యంలో అలాంటి వారికి తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికేట్ ఇవ్వాలనేది కేంద్రం గైడ్ లైన్స్.. ఈ నేపథ్యంలో సుమారుగా 18 వేల మందికి ఇలా తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో వారికి కూడా నోటీసులు రాగా.. వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకుని.. పింఛన్లు కొనసాగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa