టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అత్యంత విలువైన టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనపై చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.టీటీడీకి చెందిన విలువైన భూములను టూరిజం శాఖకు బదలాయించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని తాను అడిగిన ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటికీ బదులివ్వలేదని భూమన ఆరోపించారు. పైగా, సమాధానం చెప్పకుండా తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. "ప్రశ్నించినందుకు బూతులు తిడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉంటున్నాయి. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండటం హిందువుల దురదృష్టం" అని భూమన వ్యాఖ్యానించారు.బీఆర్ నాయుడును తప్పుడు ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్గా అభివర్ణించిన భూమన, ఆయనొక దోపిడీదారుడని, పైరవీకారుడని తీవ్ర విమర్శలు చేశారు. "జూబ్లీహిల్స్ సొసైటీలో బీఆర్ నాయుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. అతని అరాచకాలపై మా పోరాటం కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.క్విడ్ప్రో కిందనే బీఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి దక్కిందని భూమన ఆరోపించారు. ఆ పదవిని అడ్డుపెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని నిరంతరం దూషణలకు దిగుతున్నారని అన్నారు. టీటీడీ చైర్మన్ పదవి శాశ్వతం కాదనే విషయాన్ని బీఆర్ నాయుడు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా భూమన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa