ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 08:55 PM

బీహార్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న “ఓటర్ అధికార్ యాత్ర”లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దర్భంగాలో చోటు చేసుకుంది. నిందితుడిని మహమ్మద్ రిజ్విగా గుర్తించారు. అతను జాలే అసెంబ్లీ నియోజకవర్గంలోని భోపురా గ్రామానికి చెందినవాడని అధికారులు తెలిపారు.


దర్భంగా ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం.. ఇండియా కూటమి నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ అలాగే ఆయన తల్లి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ ర్యాలీ వేదికపై నిల్చున్న కొంత మంది వ్యక్తులు హిందీలో ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అసభ్య పదజాలం వాడారు.


ఈ వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కావాలనే కాంగ్రెస్ నాయకులు మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. అంతేకాకుండా పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించి ఫిర్యాదు కూడా చేసింది. ఈక్రమంలోనే వీడియోలను ఆధారంగా చేసుకుని పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అత్యంత అడుగు స్థాయికి దిగజారిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దాని పాత స్వభావాన్ని, సంస్కృతిని తిరిగి తీసుకొచ్చిందని, దేశ రాజకీయాల్లో విషం నింపుతోందని ఆరోపించారు.


ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు గాంధీ కుటుంబం మోదీపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా వదిలి పెట్టలేదని అమిత్ షా చెప్పారు. కానీ వారి ఆవేవీ ఫలించకపోవడంతో ఇప్పుడు అన్ని పరిమితులు దాటి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు. ఇది ప్రతి తల్లికి, ప్రతి కొడుకుకు అవమానం అని దీన్ని 140 కోట్ల మంది భారతీయులు ఎప్పటికీ క్షమించరని వెల్లడించారు.


క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ నేత


అలాగే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ ఘటనను ఖండించారు. “దర్భంగాలో జరుగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో కాంగ్రెస్, ఆర్జేడీ వేదిక నుంచి గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లిపై అత్యంత అనుచితమైన భాష ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను” అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.


మరోవైపు ఈ వీడియోపై స్పందించిన భారత యువజన కాంగ్రెస్ మాజీ జాతీయ కార్యదర్శి మొహమ్మద్ నౌషాద్.. క్షమాపణలు చెప్పారు. ఇటువంటి చౌకబారు, అగౌరవ ప్రవర్తనను పార్టీ ఎప్పటికీ ఆమోదించదని స్పష్టం చేశారు. ఆయన ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, అయితే ఈ పనిని ప్రత్యర్థులు లేదా స్వార్థ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు చేసి ఉండవచ్చని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa