ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, చైనాపై అమెరికా సెనేటర్ సంచలన ఆరోపణలు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 08:58 PM

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తూ భారత్, చైనా దేశాలు పిల్లల మరణాలకు కారణం అవుతున్నాయని అమెరికా సెనేటర్ లిండ్రే గ్రాహం సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే భారత్ అందుకు మూల్యం చెల్లించుకుంటుందని.. మిగతా దేశాలు కూడా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఈ కామెంట్లు చేశారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెడుతూ మరీ భారత్, చైనాలను బాధ్యులను చేశారు.


అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో.. “చౌకగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తూ.. పుతిన్ యుద్ధాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న భారతదేశం, చైనా, బ్రెజిల్ సహా ఇతర దేశాలకు హెచ్చరిక. మీ కొనుగోళ్ల ఫలితంగా పిల్లలు సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇప్పుడు ఎలా ఫీలవుతున్నారు. పుతిన్‌కు మద్దతు ఇచ్చినందుకు గాను భారత్ మూల్యం చెల్లిస్తోంది. మిగతా దేశాలు కూడా త్వరలోనే చెల్లిస్తాయి" అన్నారు.


ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగించడంలో ఆర్థిక వనరులు కీలకం అని లిండ్సే గ్రాహం స్పష్టం చేశారు. పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీన పరచడానికి వాణిజ్య ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడం వల్ల ఆ ఆంక్షల ప్రభావం పూర్తిగా ఉండటం లేదనే వాదిస్తున్నారు. ఈ దేశాలు చౌక ధరలకు రష్యా చమురును కొని.. తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నాయన్నారు. కానీ ఈ కొనుగోళ్ల ద్వారా రష్యా సైనిక కార్యకలాపాలకు, ఆయుధాలకు నిధులు లభిస్తున్నాయని పేర్కొన్నారు.


ఇటీవలే ఎన్బీసీ మీట్ ది ప్రెస్‌లో కూడా రష్యా చమురు కస్టమర్లపై ఒత్తిడి పెంచి యుద్ధాన్ని ఆపాలని నిర్ణయించుకున్నామన్నారు. చమురు, గ్యాస్‌లు నుంచి ఆదాయం లేకపోతే రష్యా కుప్పకూలిపోతుందని చెప్పుకొచ్చారు. అలాగే భారత్, చైనా, బ్రెజిల్‌ను అణిచివేయడమే తమ లక్ష్యం అని కూడా వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా గతంలో భారత్ నుంచి రష్యా చమురును ఎవరూ కొనుగోలు చేయొద్దని కూడా ఐరోపా సమాఖ్య దేశాలను ఆయన హెచ్చరించారు.


రష్యా తాజాగా చేసిన దాడిలో 23 మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలోనే లిండ్సే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో ఐరోపా సమాఖ్య దౌత్య కార్యాలయం పూర్తిగా దెబ్బతిందని యూరో న్యూస్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ దాడిని ఖండించగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. తమ పట్టణాలు, కమ్యూనిటీలపై మరో దాడి జరిగిందని ప్రకటిచారు. మృతుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa