ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్లో నిర్వహిస్తోన్న ఓటర్ అధికార్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై మోదీ మొదటిసారి స్పందించారు. ఆర్జేడీ- కాంగ్రెస్ వేదికపై చనిపోయిన తన తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెకు రాజకీయాలతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేవలం తన తల్లికి మాత్రమే కాదని, దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి జరిగిన అవమానమని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు.
బిహార్ ప్రభుత్వ జీవికనిధి శాఖ సహకార సంఘ్ లిమిటెడ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడుతూ.. ఇటీవల బిహార్లో ఆర్జేడీ- కాంగ్రెస్ పార్టీ వేదికపై తన తల్లిని అవమానించారని అన్నారు. కొందరు తన తల్లిని దూషించారని, ఇది కేవలం ఆమెకు జరిగిన అవమానం మాత్రమే కాదని, దేశంలోని మహిళలందరికీ జరిగిన అవమానమని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను తనను ఎంతగానో బాధించాయని, తనలాగే బిహార్ ప్రజలు కూడా ఆవేదన చెందారనే విషయం కూడా తెలుసని చెప్పారు.
తమను పెంచేందుకు తన తల్లి హీరాబెన్ ఎంతో కష్టపడ్డారని మోదీ వివరించారు. ‘అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక మమ్మల్ని పెంచేందుకు అమ్మ కష్టపడుతూనే ఉండేది. ప్రతి పైసా కూడబెట్టి మాకు బట్టలు కొనేది.. దేశంలో మంది అలాంటి కోట్లాది మంది తల్లులు ఉన్నారు. తల్లి స్థానం చాలా గొప్పది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ కుటుంబాల్లో పుట్టినవాళ్లు.. పేద తల్లి కష్టాలు, ఆమె కొడుకు చేసే పోరాటాలను అర్థం చేసుకోలేరని దుయ్యబట్టారు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్లంతా బిహార్లో తమ కుటుంబాలకే అధికారం దక్కాలనే స్వార్థంతో ఉన్నారని మోదీ ధ్వజమెత్తారు. పేద తల్లి కడుపున పుట్టిన బిడ్డను ప్రజలను ఆశీర్వదించి, ప్రధాన మంత్రిని చేస్తే... పెత్తందార్లు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ మండిపడ్డారు.
కాగా, బిహార్లోని దర్బాంగా జిల్లాలో ఇటీవల రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని, ఆయన తల్లిని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కాగా.. దీనిపై బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మరోవైపు, ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ‘ఇది అవమానం, ద్వేషం, క్రూరత్వం అన్ని పరిమితులను దాటింది. ఇది ఎంత తప్పు అంటే రాహుల్,తేజస్వి చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించినా బీహార్ ప్రజలు వారిని క్షమించరు. చాలా సిగ్గుచేటు’ అని ఎక్స్లో బీజేపీ ట్వీట్ చేసింది. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ... కుట్రపూరితంగా బీజేపీ ఏజెంట్లు కాంగ్రెస్ కార్యక్రమంలోకి ప్రవేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు. మా యాత్రతో నిరాశకు గురైన బీజేపీ.. ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటోందని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa