ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కంపెనీ అందించిన ఫోన్లను ఉద్యోగులు ఎంతమేరకు వ్యక్తిగత అవసరాలకు వాడుతున్నారో లెక్క చెప్పాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధన ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది., కంపెనీ ఇచ్చిన ఫోన్లను పనికి ఎంత శాతం, సొంతానికి ఎంత శాతం ఉపయోగిస్తున్నారో ఉద్యోగులు ప్రతినెలా నివేదించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా, ఉద్యోగులకు ఇచ్చే 50 డాలర్ల నెలవారీ రీయింబర్స్మెంట్లో సర్దుబాట్లు చేయనున్నారు. అంటే, వ్యక్తిగత వాడకం పెరిగితే రీయింబర్స్మెంట్ తగ్గుతుందన్న మాట. సీఈఓ ఆండీ జాస్సీ నేతృత్వంలో కంపెనీలో కఠినమైన పని సంస్కృతిని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఫోన్ల వాడకంపై నిఘా ఒక్కటే కాదు, కంపెనీలో అనేక విషయాల్లో మైక్రో మేనేజ్మెంట్ పెరిగిందని 'బిజినెస్ ఇన్సైడర్' నివేదిక పేర్కొంది. రిటైల్ విభాగంలోని ఉద్యోగులు ఏదైనా వ్యాపార పర్యటనకు వెళ్లాలంటే, దానివల్ల కంపెనీకి వచ్చే లాభాలు, నిర్దిష్ట లక్ష్యాలను ముందుగానే వివరించి అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అలాగే భోజన ఖర్చుల వివరాలను కూడా క్షుణ్ణంగా నమోదు చేయాల్సి వస్తోంది. "ఇదే నా సొంత డబ్బయితే ఎలా ఖర్చుపెట్టేవాడిని" అని ప్రతి ఉద్యోగి ఆలోచించాలని ఆండీ జాస్సీ పదేపదే సూచిస్తున్నారు.అయితే, కంపెనీ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కంపెనీ ఫోన్ను ఒక సాధారణ ప్రయోజనంగా భావించే తాము, ఇప్పుడు దాని వాడకంపై కూడా ఇంతలా నిఘా పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఈ పరిణామాలు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని వారు అంటున్నారు.ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధి స్పందిస్తూ, ఇది కంపెనీ ప్రాథమిక సూత్రమైన ఆర్థిక క్రమశిక్షణలో భాగమేనని తెలిపారు. "వేగవంతమైన పనితీరు కనబరిచే సంస్కృతికి తిరిగి వెళ్లే ప్రయత్నమిది" అని ఆయన వివరించారు. ఏదేమైనా, టెక్ దిగ్గజం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఉద్యోగుల్లో మాత్రం కలవరం రేపుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa