ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయకుడి మండపం సమీపంలో చికెన్ బిర్యానీ భోజనాలు పెట్టడం వివాదాస్పదమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు.. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం నందిగామలోని గాంధీ సెంటర్లో మాజీ సీఎం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చికెన్ బిర్యానీతో భోజనాలు వడ్డించారు. అయితే ఈ కార్యక్రమం గణేష్ మండపం సమీపంలో ఏర్పాటు చేయటంతో భక్తులు, కొంతమంది స్థానికుల నుంచి అభ్యంతరం, తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
మరోవైపు అనుమతి లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహణతో పాటుగా, గణేష్ మండపం సమీపంలో చికెన్ బిర్యానీతో అన్నదానం నిర్వహించారంటూ వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుతో పాటుగా మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. నందిగామ ఎస్ఐ శాతకర్ణి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు..
మరోవైపు నందిగామ గాంధీ సెంటర్లో ఆగస్ట్ 27 నుంచి గణేశుడి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. ఈ మండపానికి భక్తులు కూడా భారీగా హాజరవుతున్నారు. అయితే ఈ మండపానికి సమీపంలోనే వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ వర్ధంతి రోజున నివాళులు అర్పించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత వినాయకుడి మండపం పక్కనే కార్యకర్తలకు చికెన్ బిర్యానీ భోజనాలను వడ్డించారని పోలీసులు చెప్తున్నారు. స్థానిక సీఐ సిబ్బందితో వచ్చి వాటర్ క్యాన్లు, సామాగ్రిని అక్కడి నుంచి తొలగించాల్సి వచ్చిందంటున్నారు.
మరోవైపు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో నందిగామ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. వాటర్ క్యాన్లను, టేబుళ్లను కిందకు పడేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆరోపించారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని. తెలుగుదేశం పార్టీ నాయకులకి తొత్తులుగా పనిచేయడం సరికాదని విమర్శిస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa