ఉగ్రవాద దాడుల నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు భారత్కు పూర్తి ఆత్మరక్షణ హక్కు ఉందని జర్మనీ స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ఉన్న న్యాయాన్ని తాము అర్థం చేసుకున్నామని తెలిపింది. భారత పర్యటనకు వచ్చిన జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్తో బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.జర్మనీ మంత్రి వాడెఫుల్ స్వయంగా భారత్ ఆత్మరక్షణ హక్కు గురించి స్పష్టంగా మాట్లాడారని జైశంకర్ తెలిపారు. గత ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను ఆయన గుర్తుచేశారు. ఈ ఆపరేషన్ అనంతరం జూన్లో జర్మనీలో పర్యటించిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి ఘనస్వాగతం లభించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని జర్మనీ అర్థం చేసుకోవడాన్ని తాము ఎంతగానో గౌరవిస్తామని జైశంకర్ పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం కూడా గణనీయంగా పెరిగిందని జైశంకర్ అన్నారు. గతేడాది జరిగిన 'తరంగ్ శక్తి' వైమానిక విన్యాసాల్లో జర్మనీ పాల్గొనడాన్ని, వారి నౌకలు గోవాకు రావడాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇలాంటి భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని ఇరువురం అంగీకరించినట్లు తెలిపారు. గతంలో రక్షణ రంగంలో ఎదురైన ఎగుమతి నియంత్రణ సమస్యలు ప్రస్తుతం పరిష్కారమయ్యాయని, అనుమతులు వేగంగా వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల్లోని పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు జైశంకర్ వివరించారు. రాజకీయ, ఆర్థిక సహకారంతో పాటు పరిశోధన, భవిష్యత్ టెక్నాలజీలు, డిజిటల్, సెమీకండక్టర్లు, విద్య, ఇంధనం వంటి రంగాల్లో కలిసి పనిచేయడంపై చర్చలు జరిగాయి. భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరగా పూర్తయ్యేలా జర్మనీ చూపుతున్న చొరవను ఆయన అభినందించారు. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లోని పరిస్థితులపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa