జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికిందర్ రజా తన కెరీర్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్ల విభాగంలో తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన రెండు మ్యాచ్ల సిరీస్లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా 39 ఏళ్ల రజా ఈ ఘనత సాధించాడు.హరారే వేదికగా శ్రీలంకతో జరిగిన సిరీస్లో రజా బ్యాట్తో చెలరేగాడు. రెండు మ్యాచ్లలో వరుసగా 92, 59 స్కోర్లతో మొత్తం 151 పరుగులు చేసి, ఒక వికెట్ కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో 2023 డిసెంబర్లో రజా రెండో ర్యాంకును అందుకోవడమే తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. తాజా ప్రదర్శనతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కూడా రజా తొమ్మిది స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్లో ఒక స్థానం మెరుగుపరుచుకుని 38వ ర్యాంకులో నిలిచాడు.ఇదే సిరీస్లో 198 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సంక ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. శ్రీలంకకే చెందిన జనిత్ లియానగే (29వ ర్యాంకు), జింబాబ్వే ఆటగాడు షాన్ విలియమ్స్ (47వ ర్యాంకు) కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. మరోవైపు, ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో 4/22 ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్, శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణను వెనక్కినెట్టి బౌలర్ల జాబితాలో నంబర్ వన్గా నిలిచాడు.ఇక, టీ20 ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్ సత్తా చాటారు. పాకిస్థాన్పై రాణించడంతో జద్రాన్ 12 స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకుకు, అటల్ ఏకంగా 346 స్థానాలు ఎగబాకి 127వ ర్యాంకుకు చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa