భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పేశాడు. ఒకానొక దశలో తన స్పిన్ మ్యాజిక్తో టీమిండియా ప్రధాన అస్త్రంగా మారిన మిశ్రా.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం (సెప్టెంబర్ 4, 2025) వెల్లడించాడు. 25 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు 42 ఏళ్ల మిశ్రా ప్రకటించాడు.
“అంతర్జాతీయ క్రికెట్లో 25 ఏళ్ల అనుభవం కలిగిన నేను ఈరోజుతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నా. నా మొదటి ప్రేమ, తొలి గురువు, నాకెంతో సంతోషాన్నిచ్చే క్రికెట్కు గుడ్బై చెబుతున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలు, గర్వపడిన క్షణాలు, బాధపడిన సందర్భాలు, నేర్చుకున్న విషయాలు చాలానే ఉన్నాయి. నాకు అవకాశం కల్పించినందుకు బీసీసీఐకి, హర్యానా క్రికెట్కు ధన్యవాదాలు. నాకు ప్రతి అడుగులో ఎంతగానో సహకరించిన నా కోచ్లు, సహాయక సిబ్బంది.. అంతేకాకుండా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని మిశ్రా ఓ ప్రకటనలో వెల్లడించాడు.
నిజానికి అమిత్ మిశ్రా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. దీంతో సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా తరఫున 2003లో తొలి వన్డే ఆడాడు. 2017లో చివరి సారికి భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత నుంచి అవకాశాల కోసం ఎదురుచూసినా భారత సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. కానీ ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్లో మాత్రం ఆడాడు. అమిత్ మిశ్రా టీమిండియా తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 156 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్, చెతేశ్వర్ పుజారాలు సైతం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్లో అమిత్ మిశ్రా అదిరే ప్రదర్శన చేశాడు. ఏకంగా మూడు హ్యాట్రిక్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ అయిన 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున తొలి హ్యాట్రిక్ తీశాడు. 2011లో దక్కన్ ఛార్జర్స్, 2013లో సన్ రైజర్స్ తరపున ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఐపీఎల్లో 162 మ్యాచుల్లో 174 వికెట్లు తీసి సత్తాచాటాడు. చివరి సారిగా ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa