ఉత్తర్ప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దేశంలోనే ప్రముఖ ఆలయం అయిన వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పనిచేసే వారికి శుభవార్త చెప్పింది. కాశీ ఆలయంలో సేవలు అందించే పూజారులు, ఇతర సిబ్బందికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ ప్రకటించింది. పూజారులు, సిబ్బందికి గతంలో ఎన్నడూ లేని విధంగా జీతాలను పెంచింది. ఒక్కొక్కరి జీతాన్ని 3 రెట్లు పెంచుతూ తాజాగా యోగి సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారందరికీ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి హోదాను కూడా కల్పించనున్నట్లు వెల్లడించింది.
ఇక కాశీ ఆలయ పూజారులు, సిబ్బందికి.. ఈ పెరిగిన జీతాలు మాత్రమే కాకుండా వీటికి అదనంగా మరిన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామని యోగి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. కాశీ విశ్వనాథ ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది అంతా ఉత్తర్ప్రదేశ్లోని ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోదాను కలిగి ఉంటారని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కాశీ ఆలయంలో పనిచేస్తున్న పూజారులకు, ఉద్యోగులకు నెలకు రూ.30 వేలు జీతం అందుతోంది. ఇప్పుడు యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. వారి వేతనాలు 3 రెట్లు పెరగనున్నాయి. అంటే ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షకు పైనే జీతం అందనుంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత కాశీ ఆలయంలో ఈ రకంగా భారీగా జీతాలు పెంచడం ఇదే తొలిసారి అని యూపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉన్న వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయంలో అప్పటి ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఆలయ పరిపాలనను చేపట్టింది. అప్పటి నుంచి ఉద్యోగులు, పూజారుల జీతాలపై ఇంత శ్రద్ధ పెట్టలేదని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ సంచలన నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్లు తెలిపాయి.
మరోవైపు.. గురువారం సాయంత్రం జరిగిన 108వ సమావేశంలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ పలు ప్రతిపాదనలకు ఆమోదం కల్పించింది. సాంప్రదాయ అభ్యాసాన్ని ప్రోత్సహించే దిశగా.. మీర్జాపూర్లోని కాక్రాహిలో ఆలయానికి ఉన్న 46 బిఘాల భూమిలో వేద విద్య, శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా కాశీలో భక్తుల రాకపోకలను మరింత సులభం చేసేందుకు కాశీ విశ్వనాథ్ ధామ్, శక్తి పీఠం విశాలాక్షి మాత ఆలయం మధ్య ప్రత్యక్షంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడ ఉన్న భవనాలను కొనుగోలు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది.
దీంతోపాటు సారనాథ్లోని బేనిపూర్లోని సంకట్ హరన్ హనుమాన్ ఆలయ అభివృద్ధి, గోశాలను మరింత ఆధునీకర చేసేందుకు కూడా కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్రోల్ రూమ్ అప్గ్రేడ్, అత్యాధునిక కెమెరాలతో ధామ్ వద్ద నిఘాను మరింత పెంచనుంది. అదనంగా లడ్డూ ప్రసాదం, రుద్రాక్ష మాలాలను పంపిణీ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆమోదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa