అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ నిరసనలతో హోరెత్తింది. నగరంలో ఫెడరల్ బలగాలను మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శనివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ చర్యను నిరంకుశత్వంగా అభివర్ణిస్తూ, వెంటనే నేషనల్ గార్డ్ దళాలను వెనక్కి పిలవాలని వారు డిమాండ్ చేశారు.నిరసనకారులు "ట్రంప్ తక్షణమే వెళ్లిపోవాలి", "డీసీకి స్వేచ్ఛ కల్పించాలి", "నిరంకుశత్వాన్ని ఎదిరించండి" వంటి నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఫెడరల్ ప్రభుత్వ జోక్యాన్ని ఖండిస్తూ, స్థానిక పరిపాలన హక్కులను గౌరవించాలని నినదించారు. ఈ ఆందోళనలతో రాజధాని వీధులు దద్దరిల్లాయి.గత నెలలో వాషింగ్టన్లో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్న కారణంతో అధ్యక్షుడు ట్రంప్ ఫెడరల్ బలగాలను నగరానికి పంపారు. అంతేకాకుండా, స్థానిక మెట్రోపాలిటన్ పోలీస్ విభాగాన్ని కూడా నేరుగా ఫెడరల్ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చారు. అయితే, ట్రంప్ చర్యలను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది ఫెడరల్ ప్రభుత్వం తన హద్దులు మీరి వ్యవహరించడమేనని, స్థానిక స్వయంప్రతిపత్తిపై దాడి అని వారు విమర్శిస్తున్నారు. అధ్యక్షుడి నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa