రాష్ట్రంలో ఉల్లిపంటకు కేంద్రంగా ఉన్న కర్నూలులో రైతులు పంటను విక్రయించలేక కన్నీరుపెడుతున్నారు. కర్నూలు ఉల్లి మార్కెట్లో వందల క్వింటాళ్ల ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 కనీస మద్దతు ధర ప్రకటించినా రైతులకు ఆ మేరకు న్యాయం జరగడంలేదు. ఆరు రోజుల కిందటి వరకు ఉల్లిని కొనుగోలు చేసిన ఏపీ మార్క్ఫెడ్.. నిల్వలు పెరిగిపోవడంతో ఇప్పుడు కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో రైతులు పూర్తిగా ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వారు కొనే ధరకు, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. సదరు వ్యత్యాసాన్ని బోనస్ రూపంలో రైతులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.గతేడాది క్వింటా రూ.5 వేలకుపైగా ధర పలికిన ఉల్లి ప్రస్తుతం రూ.500 కూడా మించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు స్పందించి కనీస మద్దతు ధర రూ.1,200గా ప్రకటించారు. దీంతో ఆగస్టు 31 నుంచి ఏపీ మార్కెఫెడ్ కొనుగోళ్లు చేపట్టింది. క్వింటా రూ.1,200 చొప్పున 1,226 టన్నులు కొనుగోలు చేసింది. మరో 292 టన్నులను రైతుబజార్లు, సంక్షేమ హాస్టళ్లు, రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. ప్రస్తుతం 934 టన్నులు(9,340 క్వింటాళ్లు) పేరుకుపోయాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన ఉల్లి నిల్వలను బయటకు పంపలేని పరిస్థితుల్లో మార్క్ఫెడ్ కొనుగోళ్లు ఆపేసింది. మార్కెట్ యార్డు లైసెన్స్ ఉన్న వ్యాపారులూ ముందుకు రావడంలేదు. అయితే, వ్యాపారులు ఎంతకు కొన్నా.. రూ.1200 చొప్పున వ్యత్యాసం అమౌంట్ను బోన్సగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ-క్రాప్ నమోదు, బ్యాంక్ ఖాతా పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్ కాపీ ఇస్తేనే బోనస్ అమౌంట్ ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ-క్రాప్ నమోదు కాని రైతులకు బోనస్ ఇచ్చేది లేదని తేల్చేశారు. మరోవైపు, మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన 12,260 క్వింటాళ్లకు సంబంధించిన రూ.1.47 కోట్లను రైతుల ఖాతాలలో ఇంకా జమ చేయలేదు. దీనితో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa