రెండు తెలుగు రాష్ట్రాల రైతులను ఇప్పుడు ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న సమస్య యూరియా. సకాలంలో వర్షాలు కురిసినప్పటికీ, అవసరమైన మేరకు యూరియా అందుబాటులో లేకపోవటంతో రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. డిమాండ్కు అవసరమైన మొత్తంలో యూరియా అందుబాటులో ఉందని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవాలు వేరేగా ఉంటున్నాయి. యూరియా, ఎరువుల కోసం సొసైటీల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కేంద్రాల వద్ద క్యూలైన్లు, రాత్రి వేళ జాగారాలు కూడా అక్కడక్కడా చోటుచేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది.
రాష్ట్రంలో యూరియా సరఫరా, తురకపాలెం మరణాలు, ఉల్లి కొనుగోళ్లు వంటి అంశాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియా అంశంపై ఆరా తీసిన చంద్రబాబు.. రైతులకు యూరియా సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 23,592 మెట్రిక్ టన్నుల యూరియా మరో పది రోజుల్లోగా ఏపీకి రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో యూరియా సమస్య లేకుండా చూడాలన్న సీఎం.. ఎవరైనా యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎరువుల కేటాయింపుపై కేంద్రమంత్రి జేపీ నడ్డాతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. కాకినాడ రేవుకు వస్తున్న నౌకలో ఏడు రేక్ల యూరియాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా జేపీ నడ్డాను చంద్రబాబు కోరారు. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతులకు యూరియా ఇబ్బందులు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే రబీ సీజన్లోనూ రైతుకు యూరియా పంపిణీపై ఇప్పటి నుంచే అధికారులు ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎరువులపై రైతులకు భరోసా అందించాలని చంద్రబాబు సూచించారు. మరోవైపు కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లపై సమీక్షించిన చంద్రబాబు.. క్వింటా ఉల్లి ధర 1200 రూపాయలకు తగ్గకూడదని స్పష్టం చేశారు. అంతకంటే తగ్గితే ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందంటూ ఉల్లి రైతులకు ఊరట నిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తురకపాలెం వరుస మరణాలపైనా చర్చించిన చంద్రబాబు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa