ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరాకు ముందే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అకౌంట్లోకి డబ్బులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 07:15 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. సీపీఎస్ ఉద్యోగులకు మొదటి విడత డీఏ బకాయిలను విడుదల చేసింది. సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మొదటి విడత డీఏ బకాయిలు విడుదల చేశారు. అందులో భాగంగా ఒక్కో ఉద్యోగికి రూ. 40000 నుంచి రూ.70000 వరకూ సోమవారం రోజున వారి అకౌంట్లలో జమ చేశారు. మిగిలిన వారికి విడతల వారీగా డీఏ బకాయిలు చెల్లించనున్నారు. ఒక్కో ఉద్యోగికి రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ డీఏ బకాయిలు చెల్లించనున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.


మరోవైపు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఇటీవల ఏపీఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం ద్వారా నష్టం జరుగుతుందని అన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఏపీ సీపీఎస్‌ఏ ఆధ్వర్యంలో విజయవాడలో ఇటీవల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి.. పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరారు. అప్పటి వరకూ పోరాడతామని ఆంధ్రప్రదేశ్‌ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది.


మరోవైపు ఏటా సెప్టెంబర్ ఒకటో తేదీని సీపీఎస్ ఉద్యోగులకు బ్లాక్ డే అని ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. సెప్టెంబర్ ఒకటి 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో చేరినవారికి సీపీఎస్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీని బ్లాక్ డేగా పేర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.


అలాగే సీపీఎస్ బదులుగా ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా అవుతోందని ఇప్పటికైనా తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీపీఎస్ ఉద్యోగులు కోరుతున్నారు. వైసీపీ హయాంలో సీపీఎస్ బదులుగా జీపీఎస్ ఆలోచన చేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa