నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. దేశాన్ని కుదిపేస్తున్న ఈ నిరసనల్లో ఇప్పుడు నిరసనకారుల మధ్యే విభేదాలు భగ్గుమన్నాయి. తాత్కాలిక ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గురువారం ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఖాట్మండులోని నేపాల్ సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. మధ్యంతర ప్రధాని పదవి కోసం పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి, ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా, నేపాల్ విద్యుత్ అథారిటీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కుల్మాన్ ఘీసింగ్ ఉన్నారు. వీరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఆందోళనకారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.మరోవైపు, దేశంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలకాలని నేపాల్ అధ్యక్షుడు కోరుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత నిరసనకారులపైనే ఉందని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. మొదట సామాజిక మాధ్యమ వేదికలపై స్వల్పకాలిక నిషేధానికి వ్యతిరేకంగా 'జెన్ జెడ్' యువత ప్రారంభించిన ఈ నిరసనలు, అనతికాలంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీయడం గమనార్హం. తాజా పరిణామాలతో దేశంలో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa