అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం ఏఎస్పేటలో విషాదం చోటుచేసుకుంది. అప్పటికే ప్రేమలో ఉన్న ఓ యువతికి బలవంతంగా వేరొకరితో పెళ్లి చేయడంతో.. ఆ మనస్తాపంతో ఆమె తన జీవితాన్ని ముగించింది. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల లక్ష్మి, 4 నెలల క్రితం ఏఎస్పేటకు చెందిన రాజు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. కానీ, ఆమెకు ఈ వివాహం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.
ఈ విషయంపై లక్ష్మి గత కొంతకాలంగా తన తల్లిదండ్రులతో గొడవపడుతోందని సమాచారం. పెళ్లికి ముందు ఆమె వేరొకరిని ప్రేమించిందని, కానీ వారి కులాలు వేరు కావడంతో ఈ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలిసింది. దీంతో తీవ్ర ఒత్తిడితోనే ఈ పెళ్లికి ఆమె అంగీకరించిందని బంధువులు చెబుతున్నారు. అయితే, ఈ వివాహం ఆమెకు నచ్చకపోవడంతో పెళ్లయినప్పటి నుంచి లక్ష్మి పుట్టింట్లోనే ఉందని సమాచారం. ఇప్పుడే అత్తారింటికి వచ్చిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే, బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఏఎస్పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలపై ఆమె కుటుంబ సభ్యులతో పాటు, బంధువులను కూడా విచారిస్తున్నారు. ఆమె ప్రేమించిన యువకుడితో కూడా పోలీసులు మాట్లాడే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa