ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? బీమా క్లెయిమ్‌లు ఎలా పని చేస్తాయి

national |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 08:47 PM

సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఒక మహీంద్రా షోరూమ్‌లో అకస్మాత్తుగా ఒక కొత్త థార్ కారు మొదటి అంతస్తు నుంచి రోడ్డుపైకి పడిపోయింది. డెలివరీ తీసుకుంటున్న సమయంలో కారు యజమాని.. నిమ్మకాయలు తొక్కించబోయారు. అయితే అప్పుడే పొరపాటున బ్రేకులకు బదులుగా యాక్సిలరేటర్ నొక్కడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదంతా అందరికీ తెలిసిందే కాగా.. ఈ కారు నష్టాన్ని ఎవరు భరిస్తారు, బీమా వర్తిస్తుందా లేదా అని అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. మరి ఎవరు ఈ నష్టాన్ని భరించనున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


ఈ సంఘటన ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లో ఉన్న మహీంద్రా షోరూమ్‌లో జరిగింది. 29 ఏళ్ల మణి పవార్ తన కొత్త ఎస్యూవీని తీసుకునేందుకు వచ్చారు. షోరూమ్ నుంచి కారును బయటకు తీయడానికి ముందు.. ఆమె టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి సంప్రదాయ పూజ చేశారు. అనంతరం వాటిని తొక్కించేందుకు కారును నెమ్మదిగా ముందుకు పోనివ్వాలనుకున్నారు. ఈక్రమంలోనే ఆమె బ్రేకులు పట్టుకోవడానికి బదులుగా యాక్సిలరేటర్ నొక్కారు. దీంతో కారు వేగంగా దూసుకువెళ్లి.. షోరూమ్‌లోని అద్దాలను పగలగొట్టి.. మొదటి అంతస్తు నుంచి రోడ్డుపై పడిపోయింది. దాదాపు రూ. 27 లక్షల విలువ చేసే ఈ కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనతో ఈ ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారు అనే ప్రశ్నలు తలెత్తాయి.


సాధారణంగా కార్ల డీలర్‌షిప్‌లు వాహనాన్ని డెలివరీ చేసే ముందు బీమా లాంఛనాలను పూర్తి చేస్తారు. ప్రీమియంను కొనుగోలుదారు చెల్లిస్తారు. కాబట్టి కారు షోరూమ్ నుంచి బయలుదేరిన క్షణం నుంచి బీమా పాలసీ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం చాలా కొత్త వాహనాలను జీరో-డిప్రిసియేషన్ బీమాతో విక్రయిస్తున్నారు. ఈ పాలసీ ప్రకారం.. చిన్నపాటి గీతలు లేదా పెద్దపాటి నష్టం అయినా పూర్తి మరమ్మత్తుల ఖర్చును బీమా సంస్థనే తిరిగి చెల్లిస్తుంది. అయితే యజమాని కేవలం ఒక చిన్న ప్రాసెసింగ్ లేదా ఫైల్ ఛార్జ్‌ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.


కాబట్టి మణి పవార్ థార్‌కు ఆమె పాలసీ వర్తించే అవకాశం ఉంది. ఈ మరమ్మత్తుల ఖర్చును ఎక్కువగా బీమా సంస్థనే భరిస్తుంది. అయితే బీమా సాధారణంగా వాహనానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతరుల ఆస్తులకు జరిగిన నష్టానికి కాదు. అందువల్ల షోరూమ్ అద్దాలకు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టానికి కస్టమర్ నుంచి పరిహారం కోరే అవకాశం ఉంది.


క్లెయిమ్‌ను ప్రారంభించడానికి.. వాహన యజమాని వెంటనే బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. సంస్థ ఒక సర్వేయర్‌ను పంపి.. నష్టాన్ని అంచనా వేయిస్తుంది. ఆ తర్వాత దెబ్బతిన్న వాహనాన్ని మరమ్మత్తుల కోసం ఒక అధీకృత సర్వీస్ సెంటర్‌కు పంపిస్తారు. నష్టం తీవ్రతను బట్టి మరమ్మత్తులకు కొన్ని రోజులు పట్టవచ్చు. బీమా సంస్థ మరమ్మత్తుల ఖర్చులను నేరుగా వర్క్‌షాప్‌తో క్యాష్‌లెస్ క్లెయిమ్ విధానంలో పరిష్కరిస్తుంది. దీనివల్ల యజమాని తన జేబు నుంచి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. క్లెయిమ్ పత్రాలను పూర్తి చేయడంలో షోరూమ్ సిబ్బంది కొనుగోలుదారులకు సహకరిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa