గత కొన్ని నెలలుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ తిరిగి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. తన వారసుడు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ముఖ్యంగా సీపీ రాధాకృష్ణన్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 21వ తేదీన దన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసిన తర్వాత నుంచి ప్రజల్లోకి రాలేదు. బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన కనిపించకుండా పోయారంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తునే నిరసనలు చేసింది. ఆయన జాడ చెప్పాలంటూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు కూడా రాసింది.
15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతులు జగదీప్ దన్ఖడ్, వెంకయ్య నాయుడు, మాజీ ప్రధానులు కూడా హాజరయ్యారు.
శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన దన్ఖడ్..
అయితే ఇన్నాళ్లూ బహిరంగంగా కనిపించకుండా ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్.. ఈ సందర్భంగానే సీపీ రాధాకృష్ణన్కు శాలువా కప్పారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. తన పదవీకాలం మధ్యలోనే దన్ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం అప్పట్లో అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఆ తర్వాత ఆయన ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. అయినా సర్కారు స్పందించలేదు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఇలా తన వారసుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం.
152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్
ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఈనెల 9వ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో.. గురువారం రోజు మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa