హృదయ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (చక్కెర), కేన్సర్ లేదా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి వంటి అసాంక్రమిక వ్యాధులతో చనిపోయేవారి సంఖ్య భారత్లో పెరుగుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. భారత్లో 2010 నుంచి 2019 మధ్య అంటే కోవిడ్ మహమ్మారి వ్యాప్తిలోకి వచ్చిన దశాబ్దంలో ఈ మరణాలు పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. ఈ మరణాలు మహిళల్లో 2.1 శాతం, పురుషుల్లో 0.1 శాతం మేర పెరిగినట్టు అధ్యయనానికి నేతృత్వం వహించిన లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన పబ్లిక్ హెల్త్ స్కూల్ ప్రొఫెసర్ మాజిద్ ఎజ్జటీ తెలిపారు. 40 ఏళ్లు దాటిన మహిళలు, 55 ఏళ్లు దాటి పురుషుల్లో మరణాల ముప్పు ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అధ్యయన నివేదిక ది లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అసాంక్రమిక వ్యాధులతో మరణించే 0-80 ఏళ్ల వయసున్న మహిళ సంఖ్య అంతకు ముందు దశాబ్దంలో స్వల్పంగా తగ్గిన తర్వాత పెరిగింది. ఈ సంఖ్య 2001లో 46.7 శాతం, 2011లో 46.6 శాతం ఉండగా..2019లో 48.7 శాతానికి పెరిగింది. ఇది పురుషుల విషయంలో తక్కువగానే ఉంది. ఎందుకంటే గుండె జబ్బులు, లివర్ సిరోసిస్ వంటి 20 ప్రధాన మరణ కారణాల్లో ఎనిమిదింటికి మెరుగైన రోగ నిర్ధారణ, చికిత్స అందుబాటులోకి వచ్చింది.
అధ్యయన పత్రం ప్రకారం.. 2010-2019 కాలంలో మొత్తం అసాంక్రమిక వ్యాధుల మరణాల్లో పెరుగుదలకు గుండెపోటు, మధుమేహం (ప్రత్యేకించి మధుమేహంతో వచ్చే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి సహా) రెండింటి ప్రభావం స్త్రీ, పురుషుల్లో ఎక్కువగా ఉంది. అదే సమయంలో, లివర్ సిరోసిస్, ఇతర వ్యాధుల వల్ల కలిగే మరణాలు ఇరు వర్గాల్లోనూ తగ్గాయి. అయితే, పురుషుల్లో ఉదర కేన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, స్ట్రోక్, ఇతర రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల చికిత్సల్లో మెరుగుదల నమోదయ్యింది. కానీ, డేటా ప్రకారం భారత్లో ఊపిరితిత్తుల కేన్సర్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోని ఈ మరణాలు పెరుగుతోన్న ఐదు దేశాల్లో భారత్ కూడా ఒకటి అని పేర్కొంది. ఈ జాబితాలో భారత్తో పాటు అర్మేనియా, ఇరాన్, ఈజిప్టు, పపువా న్యూగినియాలు ఉన్నాయి.
అయితే, తమ అధ్యయన ఫలితాలను చాలా లోతుగా విశ్లేంచకూడదని ఆథర్స్ హెచ్చరించారు. దీనికి కారణం అందుబాటులో ఉన్న డేటా నాణ్యత "తక్కువ"గా ఉండటమే. అందువల్ల ఈ ఫలితాలు గణనీయమైన అనిశ్చితి నెలకుంది. ఫలితాలను విస్తృతంగా విశ్లేషిస్తే ప్రపంచంలోని 185 దేశాల్లో 33 దేశాల్లో మహిళలకు, 38 దేశాల్లో పురుషులకు అసాంక్రమిక వ్యాధుల మరణాల ముప్పు పెరిగింది. ఇందులో భారత్ ఒకటి కావడం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు, 152 దేశాల్లో పురుషులకు, 147 దేశాల్లో మహిళలకు ఆ అవకాశం తగ్గింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa