ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీల కర్కి.. కాసేపట్లో ప్రమాణస్వీకారం

international |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 09:03 PM

నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక ప్రధాన మంత్రిగా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల్ కర్కి పేరును ప్రకటించారు. ఆమె అభ్యర్ధిత్వంపై జెన్ జి, ఆర్మీ, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్లమెంట్‌ను అధ్యక్షుడు రద్దుచేయడంతో తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణం చేయనున్నారు. తాత్కాలిక ప్రధాని ఎంపికపై గురువారం నుంచి అధ్యక్షుడు, జెన్‌-జీ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. సైనిక హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ చర్చల్లో అధ్యక్షుడితోపాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తొలుత మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల కర్కిను జెన్ జి ప్రతిపాదించింది. తర్వాత కాఠ్మాండూ మేయర్‌ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ సీఈవో కుల్మన్‌ ఘీషింగ్‌, ధరణ్‌ మేయర్‌ హర్కా సంపంప్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, జెన్ జి ప్రతినిధులు పట్టువీడకపోవడంతో జస్టిస్ సుశీలను ప్రధానిగా ఎంపికచేయక తప్పలేదు. శుక్రవారం అర్ధరాత్రిలోగా కొత్త ప్రధాని పేరును ప్రకటించకుంటే అద్యక్ష భవనాన్ని పేల్చేస్తామని జెన్ జి ఆందోళనకారులు అల్టిమేటం జారీచేశారు. దీంతో అధ్యక్షుడు, ఆర్మీ దిగిరాక తప్పలేదు. జస్టిస్ కర్కి అభ్యర్ధిత్వానికి వారు ఆమోదం తెలిపారు.


టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించిన జస్టిస్ సుశీల.. ఆ తర్వాత న్యాయవ్యవస్థలో ప్రవేశించారు. నిర్భయంగా తీర్పులు వెలువరిస్తూ.. ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టి.. రాజ్యాంగ పరిషత్ సిఫార్సు మేరకు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. దీంతో నేపాల్‌ సుప్రీంకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుత జెన్ జీ ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె న్యాయమూర్తిగా ఉన్నప్పుడే మహిళలు తమ పిల్లలకు పౌరసత్వం ఇచ్చేలా అనుమతించే తీర్పు ఇచ్చారు. అప్పటి వరకూ నేపాల్‌లో కేవలం పురుషులకే ఈ హక్కు ఉండేది. జస్టిస్ సుశీల తన తీర్పులతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.


ఇక, నేపాల్‌లో ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా యాప్‌లు, వేదికలను నేపాల్ ప్రభుత్వం గతవారం నిషేధించింది. ఇది యువతలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వీటిపై ఆధారపడిన వేలాది మంది వ్యాపారులు, యువకులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి నిషేధం ఎత్తివేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారడంతో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను టార్గెట్ చేశారు. నేపాల్ పార్లమెంట్, అధ్యక్ష భవనం, ప్రధాని వ్యక్తిగత నివాసం, మంత్రులు ఇళ్లు, మాజీ ప్రధానుల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకోడానికి వీధుల్లో పరుగులు పెట్టారు. కొందరు మంత్రులు హెలికాప్టర్ల రోప్‌లకు వేలాడుతూ ప్రాణాలను కాపాడుకున్నారు.. నేపాల్ వ్యవస్థల్లో వేళ్లూనుకుపోయిన అవినీతిని మా ముందు తరాలు సహించాయి కానీ.. ఇది మా తరంతోనైనా అంతం కావాలని వారు బలంగా కోరుకున్నారు. కర్ఫ్యూలను సైతం లెక్కచేయకుండా నిరసనలు కొనసాగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa