ఓ ప్రేమ వ్యవహారంలో హిజ్రాల జోక్యం..నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హిజ్రాలు దాడి చేశారనే మనస్తాపంతో ఓ మహిళ బలవన్మరణానికి యత్నించింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు శనివారం చనిపోయింది. విజయవాడలోని గిరిపురం లో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గిరిపురం ప్రాంతానికి చెందిన గోపిచంద్ అనే యువకుడు, ఓ అమ్మాయిని ప్రేమించాడు. అదే ప్రాంతానికి చెందిన మంజుల అనే యువతిని మూడేళ్లుగా గోపీచంద్ ప్రేమిస్తున్నాడు. అయితే సెప్టెంబర్11వ తేదీన యువతి తరఫున కొంతమంది హిజ్రాలు గోపీచంద్ ఇంటి మీద దాడి చేశారు.
గోపీచంద్తో పాటుగా అతని తండ్రి కుమార్బాబు, తల్లి కుమారిని ఇష్టానుసారం కొట్టారు. అందరి ముందు హిజ్రాలు ఇంటి మీద దాడి చేసి.. తమను కొట్టడంతో గోపీచంద్ తల్లి కుమారి మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అయితే కుటుంసభ్యులు వెంటనే గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందిన కుమారి.. శనివారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహిళ కుటుంబసభ్యులు, బంధువులు మాచవరం పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇంటిపై దాడి చేసి, కుమారి ఆత్మహత్యకు కారణమైన హిజ్రాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అయితే ఇటీవలి కాలంలో కొంతమంది హిజ్రాల ఆగడాలు మరీ మితిమీరుతున్న సంగతి తెలిసిందే. బస్టాండులు, రైల్వేస్టేషన్ల వద్ద హిజ్రాల డబ్బుల వసూళ్ల వ్యవహారం అందరికీ అనుభవమే. డిమాండ్ చేసినకాడికి ఇవ్వకపోతే.. అసభ్యకర రీతిలో ప్రవర్తించడం, బూతులు తిట్టడం మామూలుగా మారిపోయింది.
దీంతో జనం వారికి భయపడేలా హిజ్రాల ప్రవర్తన ఉంటోంది. ఇక శుభకార్యాలు, గృహ ప్రవేశాల సమయంలోనూ గుంపులు, గుంపులుగా వాలిపోవటం, భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేయడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో ఏకంగా ఓ కుటుంబం మీద దాడి చేయడం.. ఈ అవమానం భరించలేక కుటుంబంలోని మహిళ ఆత్మహత్య చేసుకోవటం సంచలనం రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa