ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగోలో ఘోర పడవ ప్రమాదాలు.. 193 మంది జల సమాధి

international |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 09:09 PM

మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో లో రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 193 మంది చనిపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. కాంగో అధికారులు, ప్రభుత్వ మీడియా శుక్రవారం నాడు ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రెండు ప్రమాదాలు బుధవారం (సెప్టెంబర్ 10, 2025), గురువారం (సెప్టెంబర్ 11, 2025) తేదీల్లో జరిగాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం దాదాపు 150 కిలోమీటర్లు. ఈ ప్రాంతం ఈక్వెటర్ ప్రావిన్స్‌లో ఉంది.


గురువారం చోటు చేసుకున్న ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంత్రం లుకోలెలా భూభాగం నుంచి ఒక పడవ బయలు దేరింది. దీనిలో దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే మార్గ మధ్యలో ఉండగానే పడవలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 107 మంది చనిపోయినట్లు కాంగో ప్రభుత్వం ప్రకటించింది. 209 మంది ప్రయాణికులని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మలాంగే గ్రామానికి చెందిన ఓ పడవ సాయంతో.. ప్రయాణికులు ఒడ్డుకు చేరుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ నివేదికల ప్రకారం.. సుమారు 146 మంది గల్లంతయ్యారని మీడియా సంస్థ వెల్లడించింది.


దీనికి ఒకరోజు ముందు, అంటే బుధవారం సెప్టెంబర్ 9 నాడు ఒక మోటారు పడవ బసంకుసు ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కనీసం 86 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు అని ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇంకా చాలా మంది కనిపించకుండా పోయారు. అయితే ఎంత మంది గల్లంతయ్యారనే దానిపై క్లారిటీ లేదు. బుధవారం నాడు జరిగిన ప్రమాదానికి కారణం.. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారని.. పైగా రాత్రిపూట ప్రయాణం చేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి.


ఈ మధ్యకాలంలో పడవలు మునిగిపోయే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది ప్రజలు రోడ్డు మార్గాన్ని వదిలిపెట్టి, తక్కువ ఖర్చు అనే అభిప్రాయంతో పడవ ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అయితే పరిమితికి మించి ప్రయాణికులు పడవల్లోకి ఎక్కడం వల్ల అవి బరువు మోయలేక పనీట మునగడం వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పైగా ఇలాంటి ప్రయాణాల్లో లైఫ్ జాకెట్లు చాలా అరుదుగా ఉంటాయి. దీనికి తోడు చాలా పడవలు రాత్రిపూట కూడా ప్రయాణిస్తుంటాయి. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం కష్టమవుతుంది. చాలా మృతదేహాలు లభ్యం కావడం లేదు. ఆ తర్వాత కూడా అవి దొరకడం లేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa