హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయిన నేపాల్ లో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నట్లే అనిపిస్తోంది. నేపాల్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్లో ప్రధాని మోదీ..‘నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుశీల కర్కికి నా శుభాకాంక్షలు. నేపాల్ ప్రజల శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం భారతదేశం కట్టుబడి ఉంది’ అని తెలిపారు. అలానే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటాన్ని స్వాగతించింది. ఇది పొరుగు దేశంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు దేశాల ప్రజల క్షేమం కోసం ఇండియా కట్టుబడి ఉందని చెప్పుకొచ్చింది.
సుశీల కర్కి నేపాల్ అధ్యక్ష కార్యాలయం అయిన శీతల్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు రామ్చంద్ర పౌడెల్ సమక్షంలో నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జెన్ జెడ్ నిరసనల కారణంగా కేసీ శర్మ ఓలి ప్రభుత్వం పడిపోయింది. ఆ తరువాత సుశీల కర్కి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ప్రారంభంలో సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో నిరసనలు మొదలయ్యాయి. ఆ తరువాత అవినీతి, బంధుప్రీతి, రాజకీయ నాయకుల ఆగడాలకి వ్యతిరేకంగా నేపాల్లో పెద్ద ఉద్యమం జరిగింది. ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగాయి. ఖాట్మండు అంతటా సైన్యాన్ని మోహరించారు.
ప్రధాని పదవి కోసం నేపాల్ విద్యుత్ సంస్థ మాజీ చీఫ్ కుల్మాన్ ఘిసింగ్, ఖాట్మండు మేయర్ బలేంద్ర షా, ధరణ్ మేయర్ హర్కా సంపాంగ్ కూడా పోటీ పడ్డారు. 2016లో నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కార్కి ఎన్నికయ్యారు. అయితే ఆమె గతంలో పలు కేసుల్లో పక్షపాత ధోరణితో తీర్పులు చెప్పారని.. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని అభియోగాలు రావడంతో అభిశంసనను కూడా ఎదుర్కొన్నారు. కానీ జెన్ జడ్ యూత్ ఎక్కువ మందికి ఆమెకి మద్దతు తెలపడంతో.. చివరకు సుశీల కర్కి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
ఉపాధ్యాయురాలిగా తన కెరీర్ ప్రారంభించిన సుశీల.. ఆ తర్వాత న్యాయవ్యవస్థలో ప్రవేశించారు. నిజాయతీగా తీర్పులు వెలువరిస్తూ.. ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో నేపాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టి.. రాజ్యాంగ పరిషత్ సిఫార్సు మేరకు పూర్తిస్థాయిలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa