ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌లో భారతీయుడ్ని కిడ్నాప్ చేసి టార్చర్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:20 PM

ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని భారతీయ యువకుడ్ని నమ్మించి, అతడ్ని ఇరాన్‌లో ఓ ముఠా కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసింది. చివరకు బాధితుడి కుటుంబం కిడ్నాపర్లకు రూ.20 లక్షలు చెల్లించి తమ కుమారుడ్ని విడిపించుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కేరళకు చెందిన యువకుడు హిమాన్షు మాథుర్ విదేశాల్లో ఉద్యోగం కోసం అమన్‌ రాఠీ అనే వ్యక్తిని కలిశాడు. హర్యానాలోని కర్నాల్‌లో తాను ఇమిగ్రేషన్‌ సేవలు అందిస్తున్నట్లు అమన్ పరిచయం చేసుకున్నాడు.. షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం కావాలంటే కంటిన్యూస్‌ డిశ్చార్జి సర్టిఫికెట్ కోర్సు చేయాల్సి ఉంటుందని, ఆస్ట్రేలియాలో వర్క్‌ వీసా సులభంగా లభిస్తుందని నమ్మించాడు. అతడి మాటలను నమ్మిన బాధితుడు నోయిడాలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి కోర్సు పూర్తిచేశాడు.


ఈ క్రమంలో మళ్లీ ఆగస్టు మొదటి వారంలో మాథుర్‌ను సంప్రదించిన అమన్... తాను ఇండోనేసియాలో ఉన్నానని చెప్పాడు. ఇప్పటికిప్పుడు వీసా ఇవ్వడానికి ఓ ఏజెంట్ సిద్ధంగా ఉన్నాడని, అందుకు రూ.19 లక్షలు అడుగుతున్నాడని తెలిపాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన హిమాన్షు.. ఢిల్లీ నుంచి ఇండోనేషియాకు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత పానిపట్‌కు చెందిన విశాల్‌ అనే మరో వ్యక్తిని పరిచయం చేశాడు. ఆగస్టు 9న కర్నాల్ నుంచి ఓ వ్యక్తి వస్తాడని, అతడికి ముందు రూ.12 లక్షలు ఇవ్వాలని, మిగతా రూ.7 లక్షలు తర్వాత ఇస్తే సరిపోతుందని వివరించారు.


ఆగస్టు చివరి వారంలో హిమాన్షఉ మాథుర్‌, అమన్‌, విశాల్‌ తిరిగి ఢిల్లీకి వచ్చారు. ఒప్పందం ప్రకారం ఆగస్టు 29న అమన్‌ రాఠీతో కలిసి మాథుర్ ఇరాన్‌కు విమానం ఎక్కాడు టెహ్రాన్ నుంచి తనను ఆస్ట్రేలియాకు పంపుతారేమోనని అనుకున్నాడు. కానీ, అనూహ్యంగా వీరిని టెహ్రాన్‌లో ఓ ముఠా అపహరించి పోర్టు నగరం చాబహార్‌ తీసుకెళ్లింది. ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న మిథు కూడా ఆ కిడ్నాప్‌ ముఠాలో సభ్యుడని పోలీసులు తెలిపారు. ఐరన్ పైపులతో కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ముఠా... తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేసి అవయవాలను అమ్ముకుంటామని బెదిరించారని బాధితుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.


మాథుర్‌‌ను హింసిస్తూ సోదరుడు డింపీకి వీడియో కాల్స్ చేసిన కిడ్నాపర్లు.. కోటి రూపాయలు ఇస్తే వదిలిపెడతామని బెదిరించాడు. చివరకు రూ.20 లక్షలు ఇవ్వడానికి బాధితుడి కుటుంబం అంగీకరించింది. ఆ డబ్బును పంజాబ్‌లోని జలంధర్‌‌లో ఓ వ్యక్తికి బాధితులు అందజేశారు. దీంతో మాథుర్‌, అమన్‌లను చాబహార్‌ విమానాశ్రయం దగ్గర కిడ్నాప్ గ్యాంగ్ వదిలిపెట్టింది. సెప్టెంబర్‌ 7న మాథుర్ ఢిల్లీకి వచ్చిన తర్వాత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాథుర్‌ ఇంకా షాక్‌లోనే ఉన్నాడని, అతడు కోలుకున్న తర్వాత వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa