ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందువులు మతం మారడానికి కారణాలివే.. సిద్ధరామయ్య

national |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:21 PM

దేశంలో మత మార్పిడుల అంశం అత్యంత సున్నితమైంది. దీనిపై ఏదైనా వ్యాఖ్యలు చేసేటపుడు.. ఎంతటివారైనా ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని మతాల మనోభావాలు దెబ్బతిని.. తీవ్ర గందరగోళానికి కారణం అవుతాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగినా.. కొన్నిసార్లు కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంటున్నాయి. తాజాగా మత మార్పిడులకు కారణాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. హిందువులు మతం మారడానికి సిద్ధరామయ్య పలు కారణాలు చెప్పారు. అయితే సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ము సిద్ధరామయ్యకు ఉందా అంటూ నిలదీశారు.


ఇటీవల కులగణపై మీడియా సమావేశం నిర్వహించిన సీఎం సిద్ధరామయ్య.. మత మార్పిడుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు మతం మారి.. ఇతర మతాల్లోకి వెళ్లడానికి గల కారణాలను ఆయన వివరించారు. హిందూ మతంలో సమానత్వం లేదని.. అందుకే కొందరు.. హిందూ మతాన్ని వదిలేసి ఇతర మతాలను స్వీకరిస్తున్నారని.. సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూ మతంలో సమానత్వం అనేది ఉంటే ఎందుకు మతాన్ని మారుతారని సిద్ధరామయ్య ప్రశ్నించారు. హిందూ మతంలో సమానత్వం, సమాన అవకాశాలు ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంటరానితనాన్ని తాము ఏమైనా తెచ్చామా అని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.


కేవలం హిందూ మతంలోనే కాకుండా ఇతర మతాల్లోనూ అసమానతలు ఉండొచ్చని సిద్ధరామయ్య తెలిపారు. తాము అయినా, బీజేపీ అయినా మతం మారాలని ప్రజలను అడగడం లేదని.. కానీ అది వారి హక్కు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూ సమాజంలో అసమానతలు, అంటరానితనం కొనసాగుతున్నాయని.. ఈ ఆచారాలే.. హిందువుల్లోని కొన్ని వర్గాల ప్రజలు ఇతర మతాల్లోకి మారేందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.


ఇక మత మార్పిడుల అంశంపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఇస్లాంను ప్రశ్నించే ధైర్యం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉందా అని ప్రశ్నించింది. ఇస్లాంలో గనక సమానత్వం ఉన్నట్లైతే ముస్లిం మహిళలను మసీదుల్లోకి ఎందుకు అనుమతించడం లేదని నిలదీసింది. అంతేకాకుండా ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించడాన్ని ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. ముస్లిమేతరులు, హిందువులను ఖురాన్‌లో కాఫిర్లుగా ఎందుకు పిలుస్తున్నారని.. ఇలాంటివన్నీ అడిగే ధైర్యం సిద్ధరామయ్యకు ఉందా అంటూ కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ పక్షనేత ఆర్‌ అశోక ఎక్స్‌లో ప్రశ్నించారు.


సనాతన ధర్మాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుగా అర్థం చేసుకున్నారని.. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ సందర్భంగా ముస్లిం, క్రైస్తవ మతంలో ఉన్న అసమానతలను గుర్తు చేసిన ఆర్ అశోక.. కర్ణాటక రాష్ట్రంలోని అభివృద్ధి కార్యకలాపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిద్ధరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa