ఒకప్పుడు భారత వాయుసేన అమ్ముల పొదిలో కీలకమైన యుద్ధ విమానాలుగా పేరుగాంచిన మిగ్-21 ఫైటర్ జెట్లు త్వరలోనే అమ్మకానికి సిద్ధం కానున్నాయి. అయితే కోటి రూపాయల విలువ చేసే ఈ యుద్ధ విమానాలను కేవలం 30 నుంచి 40 లక్షలకే అమ్మబోతున్నట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. ఇంత తక్కువ ధరకే అందుబాటులోకి యుద్ధ విమానాలు వస్తుండటంతో.. వీటిని సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు భారీగా ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సంస్థల జాబితా చాలా పెద్దదిగా ఉందని అధికారులు తెలిపారు.
మిగ్-21 యుద్ధ విమానాలకు భారత వాయుసేనలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1963లో వీటిని తొలి సారిగా వాయుసేనలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అనేక యుద్ధాల్లో ఇవి కీలక పాత్ర పోషించి, దేశ రక్షణలో అసాధారణమైన సేవలను అందించాయి. వీటి పనితీరు, వేగం, సమర్థత కారణంగా ఇవి వాయుసేన వెన్నెముకగా పేరు పొందాయి. దశాబ్దాలుగా భారత గగనతల రక్షణలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ విమానాలు.. ఇప్పుడు వాటి సుదీర్ఘ సేవలకు ముగింపు పలుకుతున్నాయి. వాటిని పూర్తిగా తొలగించే ముందు వాటిలోని విలువైన ఇంజిన్లు, ఇతర సున్నితమైన వ్యవస్థలను తొలగించి, కేవలం ఎయిర్ఫ్రేమ్ను మాత్రమే విక్రయించనున్నట్లు వాయుసేన వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ నెల 26న చండీగఢ్లో మిగ్-21ల చివరి స్క్వాడ్రన్కు అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమం తరువాత ఈ విమానాలు వాటి కొత్త గమ్యస్థానాలకు పంపిస్తారు. అయితే వీటిని కొనుగోలు చేయడానికి చాంతాడంత జాబితా సిద్ధమైందని వాయుసేన వర్గాలు తెలిపాయి. దేశంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీలు, సాంకేతిక విద్యా సంస్థలు, రక్షణ రంగానికి చెందిన పరిశోధన సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు మ్యూజియంలు వీటిపై ఆసక్తిని చూపిస్తున్నట్లు వెల్లడించారు.
మిగ్-21 విమానాలను అమ్మకానికి ఉంచడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వీటి నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉండటం, ఆధునిక యుద్ధ విమానాల అవసరం పెరగడం వంటి అంశాల కారణంగా వాటిని దశలవారీగా వాయుసేన నుంచి తొలగిస్తున్నారు. కానీ వాటి చారిత్రక విలువను, భారత రక్షణ రంగంలో అవి పోషించిన పాత్రను గౌరవిస్తూ.. వాటిని ప్రజా ప్రదర్శనలకు, విద్యా ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ చర్య తీసుకున్నారు. తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉంచబడటం వలన సామాన్య ప్రజలు కూడా తమ సంస్థల తరపున వీటిని కొనుగోలు చేసి వాటి చరిత్రను భావితరాలకు పరిచయం చేయవచ్చు. ఈ విమానాలు మ్యూజియంలలో, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్రదర్శించబడితే, అవి భారత రక్షణ చరిత్రకు ఒక చిహ్నంగా నిలుస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa