భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా నేపాల్ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీతాదేవి జన్మస్థలమైన జానకీపురంలోని ప్రఖ్యాత జానకి ఆలయ ప్రధాన అర్చకులు రామ్ రోషన్ దాస్ నేపాల్ ప్రజల తరఫున ప్రధాని మోదీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందించారు.బుధవారం ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నేపాల్లో కూడా ఎంతో గౌరవం, ప్రజాదరణ పొందుతున్నారని రామ్ రోషన్ దాస్ తెలిపారు. "మా పొరుగు దేశ ప్రధాన మంత్రి పుట్టినరోజు నేడు. యావత్ నేపాల్ సనాతన సమాజం తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలి" అని ఆయన అన్నారు. మోదీని ఒక విశ్వ నాయకుడిగా, సనాతన ధర్మానికి గట్టి మద్దతుదారుడిగా అభివర్ణించారు.భారతదేశాన్ని సనాతన ధర్మ మార్గంలో మోదీ విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించిన ఆయన, అదే స్ఫూర్తితో నేపాల్కు కూడా అండగా నిలవాలని ఆకాంక్షించారు. "మా దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మాకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరం. భారత్ వంటి బలమైన పొరుగు దేశం మమ్మల్ని ప్రభావితం చేసి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదు" అని రామ్ రోషన్ దాస్ వివరించారు.భారత్-నేపాల్ మధ్య మతం, సంస్కృతి, విలువల పరంగా ఎంతో పురాతనమైన బంధం ఉందని ఆయన గుర్తుచేశారు. "నేపాల్ ఎల్లప్పుడూ దేవభూమి. బలమైన భారతదేశం నేపాల్కు ఎప్పుడూ ప్రయోజనకరమే. మా దేశ యువత ఇప్పుడు మేల్కొంది. కొత్త నాయకత్వంతో నేపాల్ కూడా ధర్మం, అభివృద్ధి మార్గంలో పయనిస్తుందని ఆశిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa