ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంట ఆలస్యంగా స్టేడియానికి వచ్చిన పాక్ ఆటగాళ్లు.. యూఏఈతో మ్యాచ్ షురూ

sports |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 10:19 PM

ఆసియాకప్ 2025లో భాగంగా పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితి వీడింది. షేక్ హ్యాండ్ వివాదం నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభానికి కనీసం గంట ముందు ఆటగాళ్లు స్టేడియానికి రావాల్సి ఉంటుంది. కానీ పాక్ ఆటగాళ్లు మాత్రం ఇవాళ హోటల్‌ గదులకే ఎక్కువసేపు పరిమితమయ్యారు. పీసీబీ ఆదేశాల మేరకు వారంతో తమ తమ గదుల్లోనే ఉండిపోయారు. దీంతో పాక్, యూఏఈ మ్యాచ్ జరగదనే ప్రచారం జరిగింది. ఈ మేరకు పాకిస్థాన్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి.


ఓ పక్క మ్యాచ్‌కు సమయం ఆసన్నమవుతుండగా యూఏఈ టీమ్ మాత్రం షెడ్యూల్ ప్రకారం దుబాయ్ స్టేడియానికి చేరుకుంది. అటు పాకిస్థాన్ ఆటగాళ్లు కిట్‌లు వచ్చినా.. ఆటగాళ్లు మాత్రం రాలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఈ మ్యాచ్‌ నుంచి తప్పిస్తేగానీ.. తాము మ్యాచ్ ఆడబోమని పాక్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. కానీ ఐసీసీ మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి. చివరకు ఏమైందో ఏమోగానీ.. సుమారు రాత్రి 7 గంటల సమయంలో పీసీబీ.. మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం కోరింది.


పీసీబీ నుంచి ప్రకటన వచ్చిన కాసేపటికే పాక్ ఆటగాళ్లు.. హోటల్ గదుల నుంచి స్టేడియానికి బయలుదేరారు. ఎట్టకేలకు స్టేడియానికి చేరుకున్నారు. అంతలోపు చర్చలు కూడా కొలిక్కి రావడంతో పీసీబీ.. మ్యాచ్ నిర్వహణకు అంగీకరించింది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30కి టాస్ పడాల్సి ఉండగా.. పీసీబీ అభ్యర్థన మేరకు గంటల ఆలస్యంగా రాత్రి 8.30కి టాస్ పడింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ ఫస్టు బ్యాటింగ్ చేస్తోంది. పాక్ జట్టు రెండు మార్పులతో ఈ మ్యాచ్‌ బరిలోకి దిగింది. యూఏఈ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa