అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో గందరగోళానికి తెరలేపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాను భారత్పై ఆంక్షలు విధించానని చెబుతూనే, ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితుడని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకే ప్రకటనలో పరస్పర విరుద్ధమైన అంశాలను ప్రస్తావించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.గురువారం యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధించడం ద్వారా పుతిన్పై ఒత్తిడి పెంచవచ్చా? అని ఒక విలేకరి ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ, చమురు ధర తగ్గితే రష్యా యుద్ధాన్ని ఆపేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా భారత్ ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన, "మీకు తెలిసినట్లుగా, నేను భారత్కు, ప్రధాని మోదీకి చాలా దగ్గరివాడిని. నేను మొన్న ఆయనతో మాట్లాడాను. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. మా మధ్య చాలా మంచి సంబంధం ఉంది. ఆయన కూడా ఒక చక్కటి ప్రకటన విడుదల చేశారు. కానీ, నేను వారిపై ఆంక్షలు విధించాను" అని అన్నారు.అయితే, కొద్ది గంటల తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దీనికి భిన్నంగా ఉంది. ప్రధాని మోదీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్ యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని గతంలో కొందరు అమెరికా అధికారులు విమర్శించగా, అందుకు విరుద్ధంగా ట్రంప్ తన పోస్ట్లో స్పందించారు. "రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు మీరు చేస్తున్న మద్దతుకు ధన్యవాదాలు నరేంద్ర" అని ట్రంప్ పేర్కొన్నారు.ట్రంప్ ఫోన్కాల్కు ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. "మీ ఫోన్కాల్కు, 75వ పుట్టినరోజు శుభాకాంక్షలకు ధన్యవాదాలు మిత్రమా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు మేం మద్దతిస్తాం" అని మోదీ బదులిచ్చారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ గందరగోళ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa