ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెలుపోటములు పక్కన బెట్టి మానవత్వాన్ని చాటుకున్న ఆటగాళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 04:27 PM

ఆసియా కప్ 2025లో శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన కీలక మ్యాచ్ తర్వాత మైదానం బయట ఊహించని విషాదం చోటుచేసుకుంది. గెలుపోటముల సంతోషం, బాధ కంటే మానవత్వమే గొప్పదని చాటిచెప్పే ఈ సంఘటన క్రీడాలోకాన్ని కదిలించింది. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే తండ్రి సురంగా వెల్లలాగే, మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గుండెపోటుతో మరణించారు.ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ పై శ్రీలంక విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు ఆనందం ఆ జట్టుకు ఎంతోసేపు నిలవలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత, డ్రెస్సింగ్ రూమ్‌లో దునిత్ వెల్లలాగేకు అతని తండ్రి మరణవార్తను జట్టు యాజమాన్యం తెలియజేసింది. దీంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ కష్టకాలంలో అతడికి కోచ్ జయసూర్య, ఇతర సహచరులు అండగా నిలిచారు.ఈ విషాద వార్త అఫ్ఘనిస్థాన్ ఆటగాడు మహమ్మద్ నబీని తీవ్రంగా కలచివేసింది. మ్యాచ్ తర్వాత ఓ రిపోర్టర్ వెల్లలాగే తండ్రి మరణించిన విషయాన్ని చెప్పగా, నబీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. "అవునా? ఎలా జరిగింది?" అంటూ ఆశ్చర్యపోయి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రత్యర్థి ఆటగాడి కుటుంబంలో జరిగిన విషాదానికి నబీ స్పందించిన తీరు అందరి హృదయాలను గెలుచుకుంది.ఇదే సమయంలో, కామెంట్రీ బాధ్యతల్లో ఉన్న శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. సురంగా వెల్లలాగే తనకు స్కూల్ రోజుల నుంచే తెలుసని చెబుతూ, ఇద్దరూ ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లుగా ఆడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. "సురంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీకి కెప్టెన్‌గా ఉంటే, నేను సెయింట్ పీటర్స్‌కు నాయకత్వం వహించాను. ఈ వార్త నన్ను చాలా బాధించింది" అని ఆర్నాల్డ్ పేర్కొన్నారు. క్రీడల్లో పోటీ సహజమే అయినా, ఇలాంటి విషాదకర సమయాల్లో ఆటగాళ్లంతా ఒకే కుటుంబంలా నిలవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa