ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ నష్టపోయిన ఓ బీజేపీ నాయకుడి కుమారుడు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టడానికి తాను చనిపోయినట్టు డ్రామా ఆడాడు. ప్లాన్ ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా తన కారులో నదిలో ముంచేసి.. వేరే ప్రాంతానికి వెళ్లి దాక్కున్నాడు. తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో ఏకంగా పది రోజుల పాటు స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ దళాలు నదిలో 20 కిలోమీటర్ల పొడవునా అతడి కోసం గాలించారు. కారును బయటకు తీశారు కానీ, అతడి ఆచూకీ మాత్రం లభించలేదు. కానీ, చివరకు ఇదంతా మోసం అని తెలియడం పోలీసులు షాకయ్యారు. విస్తుగొలిపే ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబరు 5న పోలీసులకు స్థానిక కాళీసింధి నదిలో ఓ కారు మునిగిపోయినట్టు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సాయంతో గాలించగా కేవలం కారు మాత్రమే లభ్యమైంది. దాని నెంబరు ఆధారంగా ఈ కారు బీజేపీ నాయకుడు మహేష్ సోనీ కుమారుడు విశాల్ సోనీదిగా గుర్తించారు. ఈ క్రమంలో అతడి ఆచూకీ కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాలింపులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహేష్ సోనీ ఆరోపించడంతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి 20 కిలోమీటర్ల పరిధిలో దాదాపు రెండు వారాల పాటు నది మొత్తం జల్లెడ పట్టారు. ఎనిమిది రోజుల తర్వాత కూడా విశాల్ జాడ కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం బలపడింది.
వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అకాంక్ష హడా అతడి మొబైల్ కాల్ డేటాను పరిశీలించడంతో చివరి లోకేషన్ మహారాష్ట్రలోని శంభాజీ నగర్ జిల్లా ఫరాదాపూర్ పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలో ఉన్నట్టు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో విశాల్ను పట్టుకున్నారు. బ్యాంకులో తన పేరున ఉన్న రుణాలను ఎగ్గొట్టడానికే చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేశానని విచారణలో అతడు అంగీకరించాడు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోన్న తనకు ఆరు ట్రక్కులు, రెండు మినీ బస్సులు ఉన్నట్టు తెలిపాడు. కానీ, వ్యాపారంలో నష్టాల వల్ల బ్యాంకు నుంచి తీసుకున్న రుణం రూ.1.40 కోట్ల చెల్లించలేని పరిస్థితి ఉందని చెప్పాడు. తాను చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ ఉంటే.. ఆ రుణాలను బ్యాంకు మాఫీ చేస్తుందనే ఉద్దేశంతో డ్రామాకు తెరతీసినట్టు వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
సెప్టెంబరు 5 తేదీన ఉదయం 5 గంటలకు విశాల్ తన ట్రక్కు డ్రైవర్ నుంచి డబ్బులు తీసుకుని.. నదీ తీరానికి కారు నడుపుకుంటూ వెళ్లాడు.హెడ్లైట్లను ఆఫ్ చేసి నదిలోకి కారును తోసేసి.. అక్కడ నుంచి బైక్పై ఇండోర్కు పారిపోయాడు. మర్నాడు తాను చనిపోయినట్టు వార్తా పత్రికల్లో వచ్చిన నివేదికలను చూసి ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంబరపడ్డాడు. ఇండోర్ నుంచి బయలుదేరి షిర్డి, శని సింగ్నాపూర్ ఆలయాలను దర్శించుకున్నాడు. తాను మహారాష్ట్రలో ఉన్నట్టు పోలీసులు గుర్తించడంతో కిడ్నాప్ డ్రామా మొదలుపెట్టాడు. కానీ, తండ్రి మహేశ్ సోనీ, సోదరులను పోలీసులు ప్రశ్నించడంతో విశాల్ మహారాష్ట్రలోని బంధువుల ఇంట్లో ఉన్నట్టు బయటపెట్టారు.
చివరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నా కేసు లేకుండానే వదిలేశారు. ఒక వ్యక్తి తన మరణాన్ని నకిలీగా సృష్టించుకున్నందుకు నేరంగా పరిగణించే ప్రత్యక్ష నిబంధన భారత రాజ్యాంగంలో లేదని, అందువల్ల విశాల్పై ఎలాంటి అధికారిక కేసు నమోదు చేయకుండా కుటుంబ సభ్యులకే అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa