ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెల మలేషియాలో మోదీ-ట్రంప్ భేటీ

national |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 09:08 PM

భారత్-అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న తరుణంలో తక్కువ ధరకు రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకోవడం.. వంటి కారణాలతో గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య కొంత గ్యాప్ ఏర్పడినట్లు.. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతోంది. భారత్‌పై అమెరికా అధిక సుంకాలతో విరుచుకుపడిన తర్వాత.. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. అవి ఓ కొలిక్కి రాకపోవడంతో.. ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులో అమెరికాలో జరగనున్న 80వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వాటికి ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆయన వెళ్లే అవకాశాలు లేవని ఇప్పటికే స్పష్టమైంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఓ వార్త ఇంటర్నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


వచ్చే నెల (అక్టోబర్‌)లో మలేషియాలో జరగనున్న ఆసియాన్ సమ్మిట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారనే ఊహాగానాలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్న తర్వాత ఈ వార్త రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై రెండు దేశాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. మరోవైపు.. నవంబర్‌లో భారత్ వేదికగా క్వాడ్ సమ్మిట్‌ జరగనుంది. ఒకవేళ మలేషియాలో ట్రంప్, మోదీ కలిస్తే.. క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ట్రంప్ భారత్‌కు రావడానికి మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


47వ ఆసియాన్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నట్లు మలేషియా ప్రధానమంత్రి దతుక్ సెరీ అన్వర్ ఇబ్రహీం తాజాగా వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు. ఇక ఇదే ఆసియాన్ సమ్మిట్‌కు చైనా ప్రధానమంత్రి (చైనా ప్రీమియర్) లీ కియాంగ్ కూడా హాజరు కానుండటంతో.. ఇప్పుడు ప్రపంచ దృష్టి మొత్తం మలేషియాపై పడింది.


మరోవైపు.. గతంలో కూడా ఆసియాన్ సమ్మిట్‌లలో ప్రధాని మోదీ క్రమం తప్పకుండా పాల్గొన్నారు. ఈ ఏడాది ఈ సదస్సు కోసం మోదీ మలేషియా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 26 నుంచి 28వ తేదీల్లో మలేషియా వేదికగా ఈ ఆసియాన్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ ఆసియాన్ సమ్మిట్‌లో మోదీ-ట్రంప్ భేటీ జరిగితే.. ఆ తర్వాత వచ్చే నవంబర్‌ నెలలో భారత్‌లో జరగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు ట్రంప్ హాజరు అయ్యే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


అయితే క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తానని ఇప్పటికే ప్రధాని మోదీకి ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే.. ట్రంప్ భారత్ టూర్‌కు సంబంధించి వైట్‌హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నెల చివర్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రధాని మోదీ వెళ్లడం లేదని.. ఈ నేపథ్యంలోనే మోదీ, ట్రంప్‌ భేటీ కావాలంటే దానికి ఆసియాన్ సమ్మిట్‌ వేదిక అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa