ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌పై అర్ధరాత్రి దాడులు.. 2 కారణాలు చెప్పిన సీడీఎస్ అనిల్ చౌహాన్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 09:09 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై భారత దళాలు విరుచుకుపడ్డాయి. అర్ధరాత్రి పూట పాక్ గడ్డపైకి చేరిన భారత సైన్యం.. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడుల్లో పాక్‌కు, పాక్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్ర సంస్థలకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను.. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ తరచూ వెల్లడిస్తోంది. అప్పటి వీడియోలను కూడా ఇండియన్ ఆర్మీ షేర్ చేస్తోంది. తాజాగా ఆపరేషన్ సిందూర్ గురించి.. త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.


అయితే ఆపరేషన్ సిందూర్‌ను అర్ధరాత్రి నిర్వహించడానికి గల కారణాలను సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వివరించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మే 7వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కావాలనే ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించినట్లు చెప్పారు. అయితే అర్ధరాత్రి వేళ.. సైన్యం దాడులు చేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. చిమ్మ చీకటిలో శాటిలైట్ చిత్రాలు, ఛాయా చిత్రాలను పొందడం.. టార్గెట్లకు సంబంధించిన ఆధారాలను సేకరించడం చాలా కష్టమైన పని అని తెలిపారు. అయినా.. అంత రాత్రి వేళ తాము పాక్‌పై దాడి చేయడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని సీడీఎస్ చెప్పారు.


అందులో మొదటిది.. భారత సాయుధ దళాలకు తమ శక్తి సామర్థ్యాలపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని.. కటిక చీకటిలోనూ పక్కాగా దాడులు చేయడం సైన్యానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అని త్రివిధ దళాధిపతి వెల్లడించారు. ఇక రాత్రి పూట ఛాయా చిత్రాలను సంగ్రహించడం, జరిగిన నష్టాన్ని అంచనా వేసే సామర్థ్యం కూడా సైన్యానికి ఉందని వివరించారు. ఇక రెండో కారణం ఏంటంటే పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం. అర్ధరాత్రి పూట దాడులు చేస్తే.. ఆ దేశ పౌరులు ఎవరికీ హాని జరగదని.. దాని వల్ల ప్రజల ప్రాణనష్టాన్ని తగ్గించాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.


మొదట తాము ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల సమయంలో ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి.. పాకిస్తాన్‌పై దాడులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పిన సీడీఎస్.. ఆ సమయంలో అజాన్ (మొదటి ప్రార్థన) జరుగుతుందని కారణంతో ఆ ఆలోచనను విరమించుకున్నామన్నారు. బహల్పూర్, మురిద్కే ప్రాంతాల్లో తెల్లవారుజామున ఆ సమయంలో చాలా మంది ప్రజలు.. ఈ అజాన్ ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉందని.. అలాంటి సమయంలో దాడులు చేస్తే.. భారీగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని భావించి.. అర్ధరాత్రి పూట దాడులు చేసినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa