ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొద్దున్నే 4 గంటలకు లేచి.. అర నిమిషంలో 2 ఓట్లు తొలగించి పడుకోండి’ రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 09:12 PM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం చేసిన ‘ఓట్ చోరీ’ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా, రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు మండిపడ్డారు. ‘ఉదయం 4 గంటలకు మేల్కొని.. అర నిమిషంలో రెండు ఓట్ల తొలగించి నిద్రపోయామా’ అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌లపై రాహుల్ గాంధీ మరోసారి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు.


కాంగ్రెస్‌ నాయకత్వం ‘విఫలమైందని’ ఒప్పుకోవాల్సిందేనని, ఆ కారణంగానే కాంగ్రెస్‌కు వరుస ఎన్నికల్లో పరాజయాలు ఎదురయ్యాయని రిజిజు విమర్శించారు. భారత యువత ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా వెళ్లిపోయిందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. వరుస ఓటమిల తర్వాత కాంగ్రెస్ పార్టీని నడిపిన రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తున్నారని, ఆయనను దేశం నమ్మదని పేర్కొన్నారు. ‘దేశంలో పేదలు, రైతులు, సామాన్యులు మోదీని తమ నేతగా అంగీకరించారు.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి వ్యవస్థలను నిందిస్తే దేశంలో ఎవరూ అంగీకరించరు.. దేశం మారిపోయింది.. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ అభివృద్ధి సాధిస్తోంది’ అని కేంద్రమంత్రి అన్నారు. రాహుల్ గాంధీ లాంటి నాయకులు భారత్‌ను ముందుకు నడిపిస్తోన్న ఇంజిన్‌ను ఆపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.


కాగా, ఎన్నికల కమిషన్, సీఈసీలపై గురువారం నాటి తన ఆరోపణలకు కొనసాగింపుగా శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ఓట్ చోరీ విషయంలో తన ఆరోపణలకు 100 శాతం పక్కా ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఆ వీడియో క్లిప్‌లో 2022 డిసెంబర్ 19న ఉదయం 4 గంటలకు ఎవరో ఒకరు కేవలం 36 సెకన్లలో రెండు పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఫారమ్‌లు తెరచి, పూర్తి చేసి, సమర్పించిన విధానాన్ని రాహుల్ గాంధీ వీడియోలో వివరించారు.


‘‘ఉదయం 4 గంటలకు నిద్రలేవండి.... 36 సెకెన్లలో రెండు ఓట్లను తొలగించండి.. మళ్లీ పడుకోండి.. ఓట్ల చోరీ ఇలా జరుగుతోంది... కాపలాదారైన ఎన్నికల కమిషన్ మేల్కొని దొంగతనం చూస్తూనే.. దొంగలను రక్షిస్తోంది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. కాగా, గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... గుర్తుతెలియని వ్యక్తులు సాఫ్ట్‌వేర్‌ ద్వారా వ్యవస్థీకృతంగా పలు రాష్ట్రాల్లో ఇష్టానుసారం ఓటర్ల జాబితాల్లో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ లాగిన్‌లు, ఫోన్ నెంబర్లతో రిజిస్టర్ చేసుకుని చోరీకి పాల్పడ్డారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa