కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన తరం జీఎస్టీ సంస్కరణలు, ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అభినందనలు తెలిపారు. ఇదొక సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన సంస్కరణ అని ఆయన ప్రశంసించారు. పరిపాలనలో పౌరుడికే పెద్దపీట వేసేలా ఈ సంస్కరణలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా చంద్రబాబు తన స్పందనను తెలియజేశారు. "ఈ సాహసోపేత, దూరదృష్టి గల సంస్కరణను తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పండుగల సీజన్లో ఈ నూతన జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు డబుల్ సంబరాన్ని తీసుకొచ్చాయి" అని ఆయన పేర్కొన్నారు. తక్కువ ధరలు, సరళీకృత పన్నుల విధానంతో ప్రజలు నేరుగా లబ్ధి పొందుతారని చంద్రబాబు అన్నారు.నూతన జీఎస్టీ విధానంలోని ప్రయోజనాలను వివరిస్తూ, "పన్ను శ్లాబుల సంఖ్యను కేవలం రెండుకు (5%, 18%) తగ్గించారు. దాదాపు 99 శాతం నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ సంస్కరణ మధ్యతరగతి, పేదలు, రైతులు, మహిళలు, యువతతో సహా అందరి జీవితాలను సులభతరం చేస్తుంది" అని తెలిపారు. సరళమైన పన్నుల విధానం వల్ల ఖర్చులు తగ్గి, వ్యాపారాలు వృద్ధి చెంది, పెట్టుబడులు ఆకర్షితమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.‘నాగరిక్ దేవో భవ’ అనే ప్రధాని మంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ సంస్కరణను ప్రతి భారతీయుడి వర్తమానానికి, భవిష్యత్తుకు ఒక బహుమతిగా చంద్రబాబు అభివర్ణించారు. "గర్వంగా చెప్పండి, ఇది స్వదేశీ అని" ప్రధాని ఇచ్చిన పిలుపు ఒక పునరుత్తేజ జాతీయ ఉద్యమంలా ఉందని, ప్రతి ఇల్లు దేశీయ ఉత్పత్తులను స్వీకరించడానికి ఇది ప్రేరణనిస్తుందని అన్నారు. వృద్ధిలో రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా చేయాలన్న ప్రధాని పిలుపు సహకార సమాఖ్య స్ఫూర్తిని చాటుతోందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్, వికసిత భారత్ స్ఫూర్తితో 'స్వర్ణాంధ్ర' సాధనకు తాను కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa